భారత త్రివిధ దళాలకు కొత్త బాస్.. ఇక పాకిస్థాన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్..!
భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాతో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటూనే ఉంది. ఈ క్రమంలో భారత కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా జనరల్ ఎన్ ఎస్ రాజా సుబ్రమణి బాధ్యతలు స్వీకరించారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30 న ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో రాజా సుబ్రమణి నియమితులయ్యారు. పాకిస్థాన్, చైనా వ్యవహారాలపై రాజా సుబ్రమణికి లోతైన అవగాహన ఉంది. సైన్యంలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న "మిలిటరీ థియేటరైజేషన్" ప్రణాళిక అమలు, మూడు దళాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై రాజా సుబ్రమణి దృష్టి సారించనున్నారు.
ఇక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్ లో జనరల్ రాజా సుబ్రమణికి త్రివిద దళాలు గౌరవ వందనాన్ని సమర్పించాయి. ఆ తర్వాత దేశ రాజధానిలోని అమరవీరుల స్థూపం వద్ద రాజా సుబ్రమణి నివాళులు అర్పించారు. గతంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్(ఎన్ ఎస్సీ ఎస్)లో సైనిక సలహాదారుగా రాజా సుబ్రమణి సేవలు అందించారు. అలాగే గతేడాది జులై 31న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఆయన పదవీ విరమణ చేశారు.
భారత కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జనరల్ రాజా సుబ్రమణి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. సాయుధ దళాల్లో రూపాంతరం, సంస్థాగత సంస్కరణల అమలే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి ప్రతిపాదించిన జేఏఐ (జాయింట్ నెస్, ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్) దృష్టికోణాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.

భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, రక్షణ మంత్రిత్వ శాఖ, వ్యూహాత్మక సంస్థలు, సంబంధిత వర్గాలన్నీ ఐక్యంగా పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మన సైనికులు, నావికులు, వాయుసేన యోధుల ధైర్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని మేం ఎప్పుడు గుర్తుంచుకుంటామన్నారు. అలాగే దేశ భద్రతకు ఆత్మనిర్భరతే మూలస్తంభమని, స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, సైన్యంలో వాటి వినియోగాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. ఇక జనరల్ రాజా సుబ్రమణి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గానే కాకుండా రక్షణమంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా కూడా వ్యవహరిస్తారు.












Click it and Unblock the Notifications