15 బ్యాగుల్లో పేలుడు పదార్థాలు తెచ్చి ఒకేసారి అందరినీ చంపేయండి: సుప్రీంకోర్టు
"15 బ్యాగుల్లో పేలుడు పదార్థాలు తీసుకువచ్చి ఢిల్లీ ప్రజలందరినీ ఒకేసారి చంపేయండి" ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు.... సుప్రీంకోర్టు. అవును ఢిల్లీలో కాలుష్యంపై సీరియస్గా రియాక్ట్ అయ్యింది సర్వోన్నత న్యాయస్థానం. పంజాబ్ హర్యానాల కాలుష్యంపై అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం ఇటు ఢిల్లీ ప్రభుత్వం అటు కేంద్రప్రభుత్వంకు కూడా మొట్టికాయలు వేసింది.

ఢిల్లీ-పంజాబ్-హర్యానా కాలుష్యంపై సుప్రీం సీరియస్
ఢిల్లీ కాలుష్య తీవ్రత గురించి ప్రస్తావించిన సుప్రీంకోర్టు... ప్రజలను గ్యాస్ చాంబర్లోకి ఎందుకు బలవంతంగా నెడుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఒకేసారి చంపేస్తే రోజు నరకయాతన ఉండదు కదా అని సీరియస్ అయ్యింది. 15 సంచుల్లో పేలుడు పదార్థాలు తీసుకొచ్చి ఒక్కసారిగా పేలిస్తే అంతా చనిపోతారు కదా... దానికి ప్రతిరోజు నరకం అనుభవించడమెందుకని ఘాటుగా వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. కాలుష్యంపై విచారణ చేసిన జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలకు చెందిన ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాలుష్యంతో తగ్గుతున్న ప్రజల ఆయుష్షు
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో నెలకొన్న కాలుష్యంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇప్పటికే కాలుష్యంతో కొన్ని మిలియన్ ప్రజల ఆయుష్షు తగ్గిపోతోందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు... ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం బారిన పడి ప్రజలు చనిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా అని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇక పంజాబ్ చీఫ్ సెక్రటరీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం... కాలుష్యం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతున్నందుకు ఆ రాష్ట్రంపై జరిమానా ఎందుకు విధించకూడదని ప్రశ్నించింది. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా బాధాకరమని కోర్టు వ్యాఖ్యానించింది.

ప్రజలను గ్యాస్ చాంబర్లలోకి నెడుతున్నారా..?
ఇక హర్యానా రాష్ట్ర చీఫ్ సెక్రటరీపై కూడా సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. కాలుష్యంను నియంత్రించకపోతే భవిష్యత్తు తరాలు చాలా ఇబ్బంది పడుతాయని పేర్కొంది. అంతేకాదు భారత్లో జీవిచడం అనేది ఆషామాషీ వ్యవహారంగా చూడరాదని ఇరు రాష్ట్రాల సీఎస్లకు బెంచ్ సూచించింది. ప్రపంచ దేశాల్లో ఇలా కాలుష్యం బారిన పడిన బాధితులకు ఇస్తున్న పరిహారం చాలా ఎక్కువగా ఉంటుందని భోపాల్ గ్యాస్ ట్రాజెడీ బాధితులకు ఇచ్చిన పరిహారం ఏ మాత్రం సరిపోదని బెంచ్ గుర్తుచేసింది. ప్రజల బాగోగులను పట్టించుకోకపోతే చీఫ్ సెక్రటరీలుగా కొనసాగేందుకు అనర్హులు అవుతారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ మధ్య ఉన్న విబేధాలను పక్కనబెట్టి కాలుష్యం నియంత్రణకు 10 రోజుల్లోగా ఒక శాశ్వతమైన ప్రణాళిక తయారు చేయాలని ఆదేశాలు జారీచేసింది.












Click it and Unblock the Notifications