సంచలన కేసు... అంతకంటే సంచలన మలుపు, అవాక్కయిన పోలీసులు
కేరళలోలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వామి గణేషానంద కేసు అనూహ్య మలుపు తీసుకుంది. ఎనిమిదేళ్లుగా తనపై స్వామీజీ లైంగిక దాడి జరుపుతున్నాడని గతంలో ఆరోపించిన న్యాయ విద్యార్థిని పూర్తిగా యూ
తిరువనంతపురం: కేరళలోలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు అనూహ్య మలుపు తీసుకుంది. తను మైనర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస లైంగిక దాడికి పాల్పడుతున్నాడనే కారణంతో ఓ స్వామిజీ జననాంగాన్ని కోసిపారేసినట్లు ప్రకటించిన మహిళ ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకుంది.
అంతేకాదు, అసలు ఆ స్వామిజీ తనపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని చెప్పింది. పైగా పోలీసులే తనతో అలా చెప్పించారంటూ సంచలన ఆరోపణలు చేసింది. వారి ఒత్తిడి మేరకే తాను అలా చెప్పానని, నిజానికి స్వామీజి తనను అసలు ముట్టుకోలేదంటూ ఓ లేఖను రాసి స్వయంగా స్వామిజీ తరుపు న్యాయవాదికి పంపించగా ఆ లేఖను ఆ న్యాయవాది కోర్టులో కూడా సమర్పించాడు.
ఈ కేసులో సదరు మహిళ చేసిన ఆరోపణలతో పోలీసులు కంగుతిన్నారు. ఉన్నట్లుండి ఆమె ఇలా అడ్డం తిరిగిందేమిటంటే తల పట్టుకున్నారు. ఆమె చెబుతున్నది కచ్చితంగా అబద్దమేనని, ఆమెకు సత్య శోధన పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి తీసుకోవాలని భావిస్తున్నారు.
కేరళలోని కొల్లాంలో గల పన్మానా ఆశ్రమంలో స్వామి గణేషానంద(హరిస్వామి) అనే స్వామీజీ న్యాయ విద్య చదువుతున్న యువతి(23) తండ్రి జబ్బును నయం చేస్తానని చెప్పి గత ఎనిమిదేళ్లుగా ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చాలా కాలంపాటు అతడి వేధింపులు భరించిన ఆమె చివరకు ఓ రోజు స్వామీజీ జననాంగాన్ని కోసేసినట్లు పోలీసులకు చెప్పింది. ఈ విషయం ఆ మధ్య పెద్ద సంచలనం కాగా పలువురు రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు సైతం ఆమె చేసిన చర్యను మెచ్చుకున్నారు.
అయితే స్వామిజీ మాత్రం.. ఆ యువతిపై తాను లైంగిక వేధింపులకు పాల్పడలేదని, పనికిరాదనే ఉద్దేశంతో తానే తన జననాంగాన్ని కోసుకున్నానని పేర్కొన్నాడు. తిరువనంతపురంలోని స్థానిక కోర్టులో సోమవారం ఈ కేసు విచారణకు రానుండగా, ఈలోగా అసలు తనపై లైంగిక దాడి జరగనేలేదంటూ ఆ యువతి లేఖ ఇవ్వడం ఈ కేసును పూర్తిగా మలుపుతిప్పింది.