70 ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదు..ఐదేళ్లలో నేను ఎలా చేయగలను: మోడీ
బీహార్: అన్ని హామీలు నెరవేర్చాలంటే తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీహార్లో ఎన్డీఏ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంద్భంగా మోడీ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు.
అంబేద్కర్ను కాంగ్రెస్ విస్మరించింది
జాముయ్, గయా నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. రెండు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు. మోడీ తన ప్రసంగంలో దళితులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దళిత ఓట్ల కోసమే అన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది. దళితులను గత ప్రభుత్వాలు విస్మరించాయని మండిపడ్డారు మోడీ. అంబేద్కర్ను కాంగ్రెస్ విస్మరించినంతగా మరే పార్టీ ఆయన్ను విస్మరించలేదని అన్నారు. రాత్రి వేళల్లో రోడ్లు ఊడ్చి పరిశుభ్రంగా ఉంచే వారితో తాను కలిసి పనిచేస్తే కాంగ్రెస్ అవమానిస్తోందని ధ్వజమెత్తారు. వారణాసిలో కొందరు మున్సిపల్ కార్మికుల కాళ్లను మోడీ కడిగిన విషయాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
70 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి చేయలేదు... నాకు మరొక అవకాశం ఇవ్వండి
తాను అన్ని హామీలను నెరవేర్చినట్లు చెప్పనని చెప్పిన ప్రధాని అన్ని హామీలు పూర్తి చేసేందుకు మరొక అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. 70 ఏళ్లలో చేయలేని కాంగ్రెస్ ఒక్క ఐదేళ్లలో అన్ని తానుమాత్రం ఎలా పూర్తి చేయగలనని ప్రశ్నించారు ప్రధాని. ఇంకా చాలా చేయాల్సి ఉంది..ఇవన్నీ పనులను చేయాలంటే తనను మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. ఇక ఉగ్రవాదం గురించి మాట్లాడిన ప్రధాని... విపక్షాలు మన సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలను మెచ్చుకోవడం మానేసి పాకిస్తాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. అంతేకాదు అంబేడ్కర్ను ఓడించేందుకు నెహ్రూ గాంధీ కుటుంబాలు సర్వశక్తులా ప్రయత్నించారని మోడీ ధ్వజమెత్తారు. ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అంబేడ్కర్ను తొలగించే ప్రయత్నం చేశారని అన్నారు.
అనుచిత వ్యాఖ్యలు: యూపీ సీఎం యోగీపై ఈసీకి మాజీ నేవీ ఛీఫ్ ఫిర్యాదు
ప్రత్యేక హోదా గురించి మాట్లాడని నితీష్ కుమార్
ఇక సభలో మాట్లాడిన బీహార్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు. ఒకప్పుడు లాంతరు ఉండేదని ఇప్పుడు అంతా వీధిదీపాలే అంటూ ఆర్జేడీని పరోక్షంగా విమర్శించారు. కేంద్రం సహాయం చేయడం వల్లే అభివృద్ధి కార్యక్రమాలు బీహార్లో జరుగుతున్నాయన్నారు. రోడ్లు, విద్యుద్దీపాలు ప్రతి గ్రామానికి కరెంటు లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం సహకరించడంతోనే జరిగినట్లు ఆయన చెప్పారు. అయితే బీహార్కు ప్రత్యేక హోదా గురించి నితీష్ మాట్లాడలేదు. 2015లో ప్రకటించిన స్పెషల్ ప్యాకేజీ కిందే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ప్రజలకు వివరించారు నితీష్.