గివ్ హర్ 5 క్యాపెయిన్: ఆ ‘ఐదు’ రోజులు తిరిగి వారికిద్దాం.. హ్యాపీగా ఉంచుదాం!
బడికెళ్లే బాలికలకు ప్రతీ నెలా ‘ఆ ఐదు రోజులు’ నుంచి విముక్తి కల్పించేందుకు ముంబైకి చెందిన ‘అమ్మాడ ట్రస్ట్’ ముందుకొచ్చింది. దీనికోసం ‘గివ్ హర్ 5’ పేరిట ఓ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది.
ముంబై: రుతుస్రావం అనేది ఆడవారిలో సహజ ప్రక్రియే అయినప్పటికీ దాని వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కౌమారంలో మొదలై మెనోపాజ్ వచ్చే వరకూ ఈ సమస్య వారిని బాధిస్తూనే ఉంటుంది.
ప్రతి నెలా రుతుస్రావానికి ముందు కడుపులో వచ్చే విపరీతమైన నొప్పికి తట్టుకోలేక విద్యార్థినులు, ఉద్యోగినులు ఆ రోజుల్లో ఇంటి పట్టునే ఉండడానికి ప్రయత్నిస్తారు. కేవలం ఈ రుతుస్రావ సమస్య కారణంగానే 400 మిలియన్ల మంది బాలికలు ఆ రోజుల్లో బడి ఎగ్గొడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
పట్టణాలు, నగరాల్లో నివసించే విద్యార్థినులు, ఉద్యోగినులు, గృహిణిలు శానిటరీ ప్యాడ్స్ ఉపయోగిస్తున్నప్పటికీ మొత్తంగా చూసుకుంటే దేశంలో 20 శాతం మంది మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 75 శాతం మందికి శానిటరీ ప్యాడ్స్ గురించి తెలియనే తెలియదట. ఈ విషయంలో గ్రామీణ ప్రాంత మహిళలు బాగా వెనకబడి ఉన్నారు. శానిటరీ ప్యాడ్స్ ఖరీదు కూడా వారికి ఒక అడ్డంకిగా మారింది.
ముంబైకి చెందిన 'అమ్మాడ ట్రస్ట్' పాఠశాల విద్యార్థినుల్లో ఈ సమస్య ను గుర్తించి.. వారికి విముక్తి కల్పించేందుకు ముందుకొచ్చింది. 'సాఫ్ కిన్స్' పేరిట మళ్లీ మళ్లీ ఉపయోగించుకోదగిన రెండు జతల శానిటరీ ప్యాడ్ లను సరఫరా చేస్తోంది. ఇవి ఏడాది పాటు ఆ రోజుల్లో ఆ సమస్య నుంచి వారికి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకు వారు ఖర్చు చేయాల్సింది కూడా కేవలం రూ.150 మాత్రమే.
ఇక కేవలం రూ.6 వేలు ఖర్చుచేయడం ద్వారా ప్రతి మహిళ జీవితాంతం ఈ సమస్య నుంచి బయటపడే అవకాశముంది. అంతేకాదు, ఈ ట్రస్ట్ 'గివ్ హర్ 5 క్యాంపెయిన్' పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎవరైనా సరే కొంత నగదు విరాళంగా ఇవ్వడం ద్వారా మహిళల జీవితంలో వారు కోల్పోయే ఆ ఐదు రోజులను తిరిగి వారికి అందించవచ్చు.
సాఫ్ కిన్స్ అంటే...
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పున:వినియోగించ దగిన బ్యాక్టీరియా రహిత శానిటరీ ప్యాడ్లను 'సాఫ్ కిన్స్'గా వ్యవహరిస్తున్నారు. ఈ శానిటరీ ప్యాడ్ ను ఉపయోగించడం ద్వారా స్త్రీలు 12 గంటలపాటు సమర్థంగా రుతుస్రావ సమస్యను అధిగమించవచ్చు.
డొనేషన్ ఇలా...
దీని కోసం అమ్మాడ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అశోక్ కురియన్ www.giveher5.org పేరుతో ఓ వెబ్ సైట్ ను రూపొందించారు. ఈ వెబ్ సైట్ ద్వారా రూ.150, రూ.300, రూ.750, రూ.1500, రూ.6000 ఇలా ఎంతైనా విరాళం అందించవచ్చు. రూ.6000 వేలు విరాళం ఇవ్వడమంటే.. ఒకరికి జీవితాంతం ఈ రుతుస్రావ సమస్య నుంచి విముక్తి కల్పించినట్లే. భారతీయులే కాదు, ఈ వెబ్ సైట్ ద్వారా విదేశీయులు కూడా మహిళల కోసం విరాళం ఇవ్వొచ్చు. ప్రతి నెలా వారు కోల్పోయే 'ఆ ఐదు రోజులు'మళ్లీ వారికి తిరిగి ఇవ్వవచ్చు.