హైకోర్టుకెళ్లలేదేం: జెఎన్యు కన్నయ్యకి సుప్రీంలో షాక్
న్యూఢిల్లీ: జవహర్ లాల్ యూనివర్సిటీలో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొని, అరెస్టైన విద్యార్థి కన్నయ్య కుమార్కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం నాడు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరపలేమని చెప్పింది. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని కన్నయ్య కుమార్ తరఫు న్యాయవాదిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. తొలుత హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
జెఎన్యులో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడంటూ ఢిల్లీ పోలీసులు కన్నయ్య కుమార్ పైన దేశ ద్రోహం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాటియాల హౌస్ న్యాయస్థానంలో హాజరుపరిచే క్రమంలో కన్నయ్యపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం కన్నయ్య బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
కన్నయ్యకు అనుకూల తీర్పు వస్తుందని అందరూ భావించారు. అయితే హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా అత్యున్నత న్యాయస్థానానికే బెయిల్ కోసం రావడం పట్ల కన్నయ్యను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ముందుగా హైకోర్టును ఆశ్రయించి, అక్కడ న్యాయం జరగకుంటే తమ వద్దకు రావాలని సూచిస్తూ ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
హైదరాబాదులో వామపక్షాల ముట్టడి
జెఎన్యు వివాదం, కన్నయ్య కుమార్ అరెస్టు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో వామపక్షాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు.