మనోహర్ పారికర్ తిరిగి గోవా సీఎంగా వస్తారా?
రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రి కావాలని బీజేపీ ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు. 40 స్థానాలు ఉన్న గోవాలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది.
పనాజీ: రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రి కావాలని బీజేపీ ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు. 40 స్థానాలు ఉన్న గోవాలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది.
బీజేపీకి 13 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎంజీపీ 3, ఇతరులు ఏడు స్థానాలు గెలుచుకున్నారు. దీంతో హంగ్ తప్పనిసరి అయింది. ఎంజీపీ, ఇతరులతో బీజేపీ చర్చలు జరుపుతోంది. వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
మనోహర్ పారికర్ సీఎం అయితే పొత్తుకు సిద్ధమని ఎంజిపి, ఇతరులు చెబుతున్నారు. పారికర్ ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్నారు.
మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రి కావాలని ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటున్నారు. ఈ మేరకు వారంతా సంతకాలు చేసిన ఒక పత్రాన్ని పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. దీనిపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. తమకు గోవాలో ఎక్కువ స్థానాలు వచ్చాయని, ఇతరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇతరులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి.