పారిశ్రామిక వేత్తలకే ‘అచ్చేదిన్’: మోడీపై అన్నా హజారే
రాలేగావ్సిద్ది: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవుతున్న అన్నాహజారే కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ హయాంలో మంచి రోజులు పరిశ్రమలకు వచ్చాయే తప్ప, సామాన్య ప్రజలకు రాలేదంటూ ఎద్దేవా చేశారు. రైతుల గురించి, పేదల గురించి ప్రధాని మోడీ పట్టించుకోలేదని ఆరోపించారు.
పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు కలిగించడమే ఆయన ఆలోచనగా మారిందని హజారే అన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో దేశానికి మంచిరోజులు తీసుకొస్తామంటూ భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసిందన్న ఆయన, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలకే మంచి చేస్తోందంటూ ధ్వజమెత్తారు.

ఈ తరహా విధానాలను అవలంబించడం వల్ల భారతదేశ భవిష్యత్తుకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని హజారే హెచ్చరించారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో రైతులతో కలిసి జంతర్మంతర్లో తీవ్రస్థాయిలో భూసేకరణ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని హజారే తెలిపారు. రైతుల నుంచి భూసేకరణకు ముందు వారి ఆమోదం తీసుకోవాలన్న నిబంధనను తొలగించడం ఎంతమాత్రం సరైంది కాదన్నారు.
కొన్ని వ్యాపార సంస్థల సలహాల మేరకే ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు. అదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ప్రశంసించిన హజారే, సమాజ సంక్షేమమే ధ్యేయంగా ఆయనలాంటి వ్యక్తులు నిబద్ధతతో పనిచేస్తారని అన్నారు. ఢిల్లీ మహా నగరాన్ని ఆదర్శనీయ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను, ప్రణాళికను అమలుచేయగలరన్న ఆశాభావాన్ని అన్నా హజారే వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications