గుడ్ న్యూస్ : గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి..ఎప్పుడంటే?
ముంబై: గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన బెంచ్మార్క్లతో అనుసంధానం చేసే కొత్త వ్యవస్థకు బ్యాంకులు మారుతున్న నేపథ్యంలో రుణగ్రహీతలు తాము తీసుకున్న రుణాలపై తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక రుణాలపై వడ్డీ కూడా 30 బేసిస్ పాయింట్ల మేరా తగ్గే అవకాశాలున్నాయి. ఒక్క బేసిస్ పాయింట్ 0.01 శాతం.
ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, రెపో రేట్ కంటే 2.65శాతం ఎక్కువగా ఉండటంవల్ల వడ్డీ 8.05శాతంకు చేరింది. ఇక దీని ప్రభావంతో రుణగ్రహీతపై మొత్తం వడ్డీ భారం 8.20గా ఉంది. ఉద్యోగస్తులు రూ.30 లక్షలు రుణం తీసుకుంటే ఎస్బీఐ 15 బేసిస్ పాయింట్ల ప్రీమియం ఛార్జీ వసూలు చేస్తుంది. ఇక రుణం తీసుకునే కస్టమర్ను ఆధారం చేసుకుని మరిన్ని అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశాలున్నాయి.
రూ.30 లక్షల నుంచి రూ. 75 లక్షల మధ్య గృహ రుణాలు తీసుకుంటున్న ఉద్యోగస్తులకు 40 బేసిస్ పాయింట్ల మేరా ప్రీమియంలో మార్పు ఉంటుంది. అంటే ఇలాంటి రుణాలపై రూ.8.45శాతంతో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు మహిళలకు గృహరుణాలపై 5 బేసిస్ పాయింట్ల మేరా తగ్గింపుతో ఇవ్వడం జరుగుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మధ్య, చిన్న సూక్ష్మ పరిశ్రమలకు ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్స్టర్నల్ బెంచ్మార్క్లలో మార్పులు చేస్తామని బ్యాంకులు తెలిపాయి.
వినియోగదారులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలని పలుమార్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఇప్పటికే సూచించింది. ఇందులో భాగంగానే ఈ నెల మొదట్లో కొన్ని రుణాలను బాహ్య బెంచ్మార్కులతో అనుసంధానం చేసి ఇవ్వాలని అది అక్టోబర్ 1 నుంచి ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇక ఫ్లోటింగ్ రేట్లు ఆధారంగా జూలై 1, 2019 నుంచే ఎస్బీఐ రుణాలు ఇస్తోంది. ఇప్పుడు మరికొన్ని మార్పులు చేసి అక్టోబర్ 1, 2019 నుంచి ఆర్బీఐ మార్గదర్శకాలను పాటిస్తూ రుణాలు ఇస్తామని వెల్లడించింది.