అది ఆసుపత్రా? స్మశానమా? మళ్లీ 24 గంటల్లో 16 మంది చిన్నారులు మృతి
ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్ బీఆర్డీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చిన్నారుల మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఈ ఆసుపత్రిలో 16 మంది చిన్నారులు మృతిచెందారు.
గోరఖ్పూర్: ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్ బీఆర్డీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చిన్నారుల మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఈ ఆసుపత్రిలో 16 మంది చిన్నారులు మృతిచెందారు.
వీరిలో 10 మంది చిన్నారులు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ మరణించగా.. మరో ఆరుగురు పీడియాట్రిక్ ఐసీయూలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మెదడువాపుతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినవారే.
గత ఆగస్టులో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడం వల్ల 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో ఒక్కసారిగా ఈ ఆసుపత్రి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఇప్పటికే ఈ కేసులో బీఆర్డీ ఆసుపత్రి యజమానితో పాటు పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ ఆసుపత్రిలో మొత్తం 310 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే తాజా మరణాలు ఆక్సిజన్ కొరత వల్ల కాదని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు చికిత్సకు స్పందించకపోవడం, వైద్య సంబంధిత కారణాల వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఆసుపత్రిలో చేరే నాటికే ఆ చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.