కేంద్రం షాక్: లావాదేవీల కుదింపు, రూ.2 లక్షలు దాటితే భారీ ఫైన్
నగదు లావాదేవీల పైన కేంద్రం షాకిచ్చింది. బడ్జెట్లో రూ.3 లక్షల వరకు పరిమితి ఇచ్చింది. తాజాగా దానిని రూ.2 లక్షలకు కుదించింది. నోట్ల రద్దు తర్వాత కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది మరో కీలక నిర్ణయం.
న్యూఢిల్లీ: నగదు లావాదేవీల పైన కేంద్రం షాకిచ్చింది. బడ్జెట్లో రూ.3 లక్షల వరకు పరిమితి ఇచ్చింది. తాజాగా దానిని రూ.2 లక్షలకు కుదించింది. నోట్ల రద్దు తర్వాత కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది మరో కీలక నిర్ణయం.
నగదు రూపంలో రెండు లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు జరిపే అవకాశం లేదు. రెండు లక్షలకు మించి జరిపితే అంత మొత్తం జరిమానా కట్టవలసి ఉంటుంది.
కాగా, నల్లధనాన్ని అరికట్టడం కోసం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఈ నగదు లావాదేవీలను రూ. 2 లక్షలకు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇందుకోసం ఫైనాన్స్ బిల్లు 2017కు సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే భారీగా జరిమానా విధించే దిశగా కేంద్రం ఈ బిల్లుకు మార్పులు చేస్తోంది.
ప్రస్తుతం ఈ బిల్లు విషయమై లోకసభలో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే లావాదేవీకి సమానంగా జరిమానా విధించనున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అదియా ట్వీట్ చేశారు.
వాస్తవానికి నగదు లావాదేవీలను రూ. 3 లక్షలకు పరిమితం చేస్తున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. మార్చి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రాగా, ఇప్పుడు దాన్ని రూ. 2 లక్షలకు పరిమితం చేసేలా ప్రభుత్వం చర్యలు ఉండటం గమనార్హం.