పోలీసు పవర్ తో ఆందోళన అడ్డుకున్నారు, సీఎం క్షమాపణ చెప్పాలి, అధికారం, యడ్యూరప్ప !
బెంగళూరు: రైతుల రుణమాఫీ చెయ్యాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసుల పవర్ తో ప్రభుత్వం అరెస్టు చేయించిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్, యడ్యూరప్ప ఆరోపించారు. ఒక్క వారంలో సీఎం కుమారస్వామి రైతుల రుణమాఫీ చెయ్యాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కన్నడిగులను అవమానించిన సీఎం కుమారస్వామి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని యడ్యూరప్ప డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ సీఎం కుమారస్వామి మీద విమర్శలు గుప్పించారు.
పోలీసుల బలప్రయోగం
సోమవారం పోలీసుల బలప్రయోగంతో బీజేపీ ఆందోళనలు విజయవంతం కాకుండా జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అడ్డుకునిందని యడ్యూరప్ప ఆరోపించారు. అనేక ప్రాంతాల్లో శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేశారని యడ్యూరప్ప మండిపడ్డారు.
మాకు హక్కు ఉంది
శాంతియుతంగా ఆందోళనలు చెయ్యడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని బీఎస్. యడ్యూరప్ప గుర్తు చేశారు. రైతుల రుణమాఫి కోసం ధర్నాలు చేశామని, ఎక్కడా రోడ్డురోకోలు నిర్వహించలేదని, ప్రజలకు ఇబ్బంది కలిగించలేదని, అయినా అరెస్టులు చేశారని యడ్యూరప్ప ఆరోపించారు.
సీఎం రాజీనామా
ఒక్కవారంలో రైతుల రుణమాఫి చెయ్యకపోతే రాజీనామా చేస్తానని సీఎం కుమారస్వామి చెప్పారని, ఒక్కవారం తాము వేచి చూస్తామని యడ్యూరప్ప అన్నారు. వారం తరువాత సీఎం కుమారస్వామి మాటతప్పి రైతుల రుణమాఫి చెయ్యకపోతే కర్ణాటక మొత్తం ఆందోళనలు చేస్తామని యడ్యూరప్ప హెచ్చరించారు.
సీఎంకు చేతకాదు
కర్ణాటకలో మంత్రి వర్గం ఏర్పాటు చెయ్యడం చేతకాని సీఎం కుమారస్వామి ఢిల్లీలో కుర్చుని రాజకీయాలు చేస్తున్నారని యడ్యూరప్ప వ్యంగంగా అన్నారు. ఢిల్లీ రాజకీయాలు వదిలిపెట్టి బెంగళూరు చేరుకుని కర్ణాటక ప్రజల కష్టాల గురించి ఆలోచించాలని యడ్యూరప్ప సీఎం కుమారస్వామికి సూచించారు.
సీఎం క్షమాపణ చెప్పాలి
తనకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చిందని సీఎం కుమారస్వామి బహిరంగంగా చెప్పారని, ఆరు కోట్ల కన్నడిగులు మీకు అధికారం ఇవ్వలేదా అని యడ్యూరప్ప ప్రశ్నించారు. కన్నడిగులను అవమానిస్తూ కుమారస్వామి వ్యాఖ్యలు చేశారని, వెంటనే కర్ణాటక ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని యడ్యూరప్ప డిమాండ్ చేశారు. ప్రజలు అధికారం ఇవ్వలేదని బహిరంగంగా చెప్పిన ఇలాంటి ముఖ్యమంత్రిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని యడ్యూరప్ప విరుచుకుపడ్డారు