ఆర్బీఐ కీలక నివేదిక: ఒకరోజు ముందే నోట్ల రద్దుపై కేంద్రం సూచన
పెద్ద నోట్లను రద్దుకు ముందు కేంద్ర ఆర్థికమంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు సలహాలు తీసుకున్నారా? అన్న ప్రశ్నకు పీఎంవో సమాధానం చెప్పలేదు.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు కేంద్రం ఎవరిని సంప్రదించింది? ఎవరి వద్ద నుంచి అభిప్రాయాలు సేకరించిందన్న అంశం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా, నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం ఒకరోజు ముందే ఆర్బీఐకి చెప్పినట్టు తెలుస్తోంది.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం..గతేడాది డిసెంబర్ లో పార్లమెంటరీ ప్యానెల్ కు ఆర్బీఐ 7పేజీల నివేదికను సమర్పించింది. ఉగ్రవాదం, నకిలీ నోట్ల బెడద, నల్లధనం వంటి వాటిని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేయడానికి కేంద్రం నిర్ణయించుకున్నట్టుగా అందులో ఆర్బీఐ పేర్కొనట్టు సమాచారం.
కేంద్రం సూచనతో?
కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ.. 'దేశ ఆర్థిక వ్యవస్థను నీడలా వెంటాడుతున్న నల్లధనాన్ని నిర్మూలించడానికి, భారత ఆర్థిక ఎదుగుదలకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది' అని నివేదికలో ఆర్బీఐ పేర్కొంది.
డ్రగ్స్, ఉగ్రవాదానికి అందుతున్న ఫైనాన్స్ అంతా నోట్ల రద్దు దెబ్బతో నిలిచిపోనుందని ఆర్బీఐ అందులో అభిప్రాయపడింది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఆర్బీఐ ఒక్కరోజులో ఆమోద ముద్ర వేసింది.
నోట్ల రద్దుకు ఒకరోజే ముందే:
నోట్ల రద్దుకు ఒకరోజు ముందే సంస్థ అధికారులతో ఆర్బీఐ ఓ సమావేశం నిర్వహించింది. కేంద్రం తీసుకుబోతున్న నోట్ల రద్దు గురించి ఈ సమావేశంలో ఆర్బీఐ చర్చించింది.
పార్లమెంటులో అదే మాట:
ఇదే విషయాన్ని యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ పార్లమెంటులోను ప్రస్తావించారు. నవంబర్ 16న పెద్ద నోట్ల రద్దుపై చర్చ సందర్బంగా.. ఆర్బీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ల నిర్ణయం మేరకే పెద్ద నోట్ల రద్దు జరిగినట్టు తెలిపారు.
రూ.5వేల నోటు ప్రతిపాదన:
ఇదిలా ఉంటే, 2014లోనే రూ.5వేలు, రూ.10వేలు నోటును ప్రవేశపెట్టాల్సిందిగా ఆర్బీఐ సూచించినట్టు తెలుస్తుండటం గమనార్హం. అయితే 2016లో రూ.2వేల నోటుకు మాత్రమే కేంద్రం ఆమోదం తెలిపింది.
ఆరు శాతం మాత్రమే:
కాగా, రూ.2వేల నోట్లను కనీస మొత్తంగా ముద్రించడం మొదలైన తర్వాతే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించే నాటికి 94,660కోట్ల విలువైన రూ.2వేలు నోట్లు ఆర్బీఐ బ్రాంచెస్ లో ఉన్నాయి. నోట్ల రద్దుతో రద్దయిపోయిన మొత్తం 15లక్షల కోట్ల డబ్బులో ఇది కేవలం 6శాతం మాత్రమే కావడం గమనార్హం.
నోట్ల రద్దుపై ఎవరి అభిప్రాయం తీసుకున్నారో!
నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ప్రధాని మోడీ ఎవరి అభిప్రాయాన్ని తీసుకున్నారన్న ఆర్టీఐ(సమాచార హక్కు) దరఖాస్తుకు పీఎంవో 'నో' చెప్పింది. ఎవరినుంచి అభిప్రాయాలు సేకరించారన్నది తమకు తెలియదని పీఎంవో కార్యాలయం వెల్లడించింది.
ఆర్థికమంత్రి సలహా తీసుకున్నారా?
పెద్ద నోట్లను రద్దుకు ముందు కేంద్ర ఆర్థికమంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు సలహాలు తీసుకున్నారా? అన్న ప్రశ్నకు పీఎంవో సమాధానం చెప్పలేదు. పీఎంవో అందుకు నిరాకరించింది. ఆర్టీఐ చట్టంలోని 'సమాచారం' నిర్వచన పరిధిలోకి ఈ ప్రశ్నలు రావని పీఎంవో పేర్కొనడం గమనార్హం.