మన్మోహాన్ను సీబీఐ విచారణ: 'బీజేపీ ప్రమేయం లేదు', 'నోరు విప్పితే దేశానికి ఎంతో మేలు'
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ను బొగ్గు కుంభకోణంలో సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో బీజేపీ ప్రభుత్వ పాత్ర ఎంత మాత్రం లేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తేల్చి చెప్పారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడతూ కాంగ్రెస్ ద్వంద వైఖరిని అవలంబిస్తోందని అన్నారు. ఇది ఇలా ఉంటే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నోరు విప్పితే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మన్మోహన్ నిజాయితీపరుడిగా పేరుందని, ఆయన నిజాలు మాట్లాడితే దేశానికి ఉపకారం చేసినవారవుతారని పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణంలో హిందాల్కో సంస్ధకు బొగ్గు క్షేత్రాలు కేటాయించిన కేసులో సీబీఐ మన్మోహన్ సింగ్ను ప్రశ్నించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి పైవిధంగా స్పందించారు.
పది సంవత్సరాల పాటు ప్రధానిమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ 2 జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కేటాయింపు సహా పలు కుంభకోణాలు వెలుగు చూశాయి. ఆ సమయంలో బొగ్గు మంత్రిత్వ శాఖను ఆయన పర్యవేక్షించారు.
2005 మే 7, జూన్ 17న ఈ బ్లాక్ను హిందాల్కోకు కేటాయించాల్సిందిగా ప్రధానిని కోరుతూ కుమార మంగళం బిర్లా రెండు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో హిందాల్కోకు బొగ్గు గని కేటాయించే సమయంలో బొగ్గు మంత్రిత్వశాఖ, ప్రధాని కార్యాలయంలో ఏమేం పరిణామాలు జరిగాయో తెలుసుకునేందుకు మన్మోహన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.