‘మోడీ పాస్’:రాహుల్ సూచన పాటించిన జైట్లీ
లండన్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిందని ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త, క్యాపరో గ్రూప్ ఛైర్మన్ లార్డ్ స్వరాజ్ పాల్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం గ్రామీణ రంగానికి పెద్దపీట వేస్తూ.. తన ప్రాధాన్యతలపై దృష్టి పెట్టిందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మన్కీ బాత్ కార్యక్రమంలో తనకు బడ్జెట్ పరీక్షలున్నాయని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఇద్దరూ పరీక్షల్లో బాగా ఉత్తీర్ణత సాధించారని స్వరాజ్ పాల్ అన్నారు.
రాహుల్ సలహాను స్వీకరించాం: జైట్లీ
పార్లమెంటులో సోమవారం బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన సూచనకు బడ్జెట్లో చోటు కల్పించారు. కేంద్రఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సలహాను స్వీకరించినట్టు తెలపడం ఆసక్తిరేపింది.
కొద్దిరోజుల కిందట బెంగళూరుకు వెళ్లిన రాహుల్గాంధీకి అక్కడ కొందరు అంధ విద్యార్థులు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బ్రెయిలీపేపర్పై సుంకాలను రద్దు చేయాలని విజ్ఞప్తిచేశారు.
ఈ వినతిని రాహుల్గాంధీ కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్కు పంపించారు. దీనిపై తాను అధ్యయనం చేసి బ్రెయిలీ పేపర్పై సుంకాన్ని తొలగిస్తున్నట్టు అరుణ్జైట్లీ తెలిపారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా రాహుల్గాంధీ ఇచ్చిన సూచనను అమలు చేస్తామని తెలపడం విశేషం.