కొత్త మెసేజింగ్ యాప్కు ప్రభుత్వం శ్రీకారం... వాట్సాప్ స్థానంలో ఇకపై ఇదే..!
న్యూఢిల్లీ: ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యక్తిగత విషయాలు వాట్సాప్ నుంచి హ్యాకింగ్కు గురికావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సొంత వాట్సాప్ను రూపొందిచాలని భావించిన ప్రభుత్వం ఆదిశగా అడుగులు ముందుకు వేస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించనున్న వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
కొత్త మెసేజింగ్ యాప్
అధికారిక సందేశాలను రహస్యంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం సొంత వాట్సాప్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్న కేంద్రం ప్రస్తుతం టెస్టింగ్ చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ నేతృత్వంలో వాట్సాప్ టెస్టింగ్ జరుగుతోంది. దీనికి గవర్న్మెంట్ ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీస్ (జిమ్స్)గా నామకరణం చేసింది. ఈ ఏడాది చివరిలో ఇది అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
యాప్ను తయారు చేస్తున్న ఎన్ఐసీ
ఇది కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, శాఖలు మాత్రమే కాకుండా జిమ్స్ యాప్ను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినియోగించుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ జిమ్స్ యాప్ను తయారు చేస్తోంది. ఇదే సంస్థ ప్రభుత్వ శాఖలకు ఈమెయిల్ సర్వీసులను కూడా అందిస్తోంది. ప్రస్తుతం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రభుత్వ శాఖలకు సంబంధించి రోజుకు 2 కోట్ల ఈమెయిల్ సర్వీసులను హ్యాండిల్ చేస్తోంది.
టెస్టింగ్ దశలో జిమ్స్ యాప్
ప్రభుత్వ విధానాలకు లోబడి జిమ్స్ యాప్ను రూపొందిస్తున్నట్లు ఓ సీనియర్ ఉన్నతాధికారి తెలిపారు.ఇక ఈ సాఫ్ట్వేర్పై మొత్తం నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ముందుగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రారంభించి ఆ తర్వాత మొత్తం 11 ప్రాంతీయ భాషల్లో యాప్ను తీసుకొస్తామని చెప్పారు సీనియర్ ఉన్నతాధికారి. ఇక ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లను సపోర్ట్ చేసేలా యాప్ రూపొందిస్తున్నామని చెప్పిన ప్రభుత్వాధికారులు... విదేశాంగ శాఖ, కేంద్ర హోంశాఖ, సీబీఐ, మెటీ, నేవీ, రైల్వే శాఖలు టెస్టింగ్ కార్యక్రమంలో పాలంగొటున్నాయని వివరించారు. ప్రస్తుతం 6600 మంది యూజర్లు ఈ యాప్ ద్వారా 20 లక్షల మెసేజ్లను జనరేట్ చేసినట్లు అధికారులు చెప్పారు. ఇక ఒడిషా గుజరాత్ రాష్ట్రాలు కూడా టెస్టింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని వెల్లడించారు.
కీలక సమాచారం హ్యాక్ అవుతుండటంతోనే..
ఈ రోజుల్లో పలు కీలక శాఖలు వాట్సాప్ లేదా ఇతర ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీసులపై సమాచారంను షేర్ చేసుకుంటున్నాయిని ఏదైనా కీలక సమాచారం హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రభుత్వం తనకంటూ ఓ సొంత మెసేజింగ్ యాప్ను తీసుకురావడంపై నిపుణులు హర్షం వ్యక్తంచేస్తూనే ఇది మంచి అడుగు అని కొనియాడుతున్నారు. సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం సొంత యాప్ కలిగి ఉండటం స్వాగతించదగ్గ విషయమని చెబుతున్నారు.