భారీ అలలు: ఏపీ, బెంగాల్, కేరళకు హెచ్చరిక, మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు: ఇన్కాయిస్
న్యూఢిల్లీ: ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, ప్రచండమైన గాలుల కారణంగా భారత తూర్పు తీరంలో సముద్రంలో భారీ అలలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 24 నుండి 26 వరకు సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడే సూచనలున్నాయని ఇన్కాయిస్ సంస్థ హెచ్చరించింది.
అండమాన్ నుండి భారత ప్రధాన భూభాగం తీరం వైపుకు ప్రచండం అలలు దూసుకువస్తున్నాయని ఇన్కాయిస్ తెలిపింది. అలల ఎత్తు సుమారు 3 నుండి 4 మీటర్ల ఎత్తులో ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ అలలు తీరానికి సమీపించే సమయంలో ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది.

అలలు హఠాత్తుగా ఎగిసిపడే ప్రమాదం ఉందని నిపుణులు చెప్పారు. అంతేకాదు తీరప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు అలలు చొచ్చుకువచ్చే అవకాశం ఉందని ఇన్కాయిస్ హెచ్చరించింది.
ఈ రెండు రోజుల పాటు సముద్రస్నానాలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడ్డారు. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించింది.
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఒడిశా, పశ్చిమ్బంగాపై ఈ అలల ఉధృతి ఎక్కువ ప్రభావం చూపించే అవకాశముంది. ఆఫ్రికా సమీపంలో ప్రచండమైన గాలుల తీవ్రత కారణంగా సముద్రంలో భారీ అలలు ఏర్పడ్డాయని వాతావారణ శాఖ స్పష్టం చేసింది.
పశ్చిమ తీరంలోని చాలా ప్రాంతాలను అలలు తాకాయని ఇన్ కాయిస్ వెల్లడించింది. అరేబియా సముద్రంలోని ఆయా ప్రాంతాల్లో 4-5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని స్పష్టం చేసింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీరాల్లో పలు లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది.












Click it and Unblock the Notifications