గౌతమి హత్య: నక్సల్స్తో మహేష్కు లింకులు
బెంగళూరు: బెంగళూరు నగరంలోని కాడుగోడి సమీపంలోని ప్రగతి కాలేజ్ లో అటెండర్ గా పని చేస్తున్న మహేష్ కు నక్సల్స్ తో లింకులు ఉన్నాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అతని ఇంటిలో నక్సల్స్ కు సంబంధించిన కరపత్రాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు.
ప్రగతి కాలేజ్ లో పీయుసీ విద్యాభ్యాసం చేస్తున్న గౌతమి (18) అనే విద్యార్థిని మహేష్ పిస్తోల్ తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడు మహేష్ ను శివమొగ్గ జిల్లాకు తీసుకు వెళ్లారు. శివమొగ్గ జిల్లాలోని మహేష్ సోంత ప్రాంతం అయిన అగుంబెకు తీసుకు వెళ్లారు.
అగుంబె సమీపంలోని మహేష్ ఇంటిలో పరిశీలించారు. అతని ఇంటిలో నక్సల్స్ కు మద్దతుగా ముద్రించిన కరపత్రాలు, నక్సల్స్ కు సంబంధించి వివిధ పత్రికలలో వచ్చిన పేపర్ కటింగ్ లు ఉన్నాయని పోలీసులు చెప్పారు. వాటిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అన్నారు.
అగుంబె దట్టమైన అటవి ప్రాంతంలో నక్సల్స్ జరిపిన రెండు రహస్య సమావేశాలకు తాను వెళ్లానని, సమావేశంలో పాల్గోన్నానని మహేష్ అంగీకరించాడని బెంగళూరు పోలీసులు అన్నారు. గత కోన్ని సంవత్సరాల పాటు నక్సల్స్ కు వివిద రకాలుగా సహాయ సహకారాలు అందించానని మహేష్ చెప్పాడని పోలీసులు అన్నారు.
అయితే గౌతమిని హత్య చెయ్యడానికి ఉపయోగించిన పిస్తోల్ ఎక్కడి నుండి తీసుకు వచ్చాడనే విషయాన్ని మహేష్ కచ్చితంగా చెప్పడం లేదని పోలీసులు అంటున్నారు. ఈ నెల 10వ తేది వరకు మహేష్ ను విచారణ చెయ్యడానికి పోలీసులకు అనుమతి ఇచ్చారు. తరువాత న్యాయస్థానం ముందు హాజరు పరిచి మళ్లి మహేష్ ను అదుపులోకి తీసుకోవాలని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు.