దారుణం: చాక్లెట్ ఆశ చూపి మూడేళ్ల చిన్నారిపై కిరణా షాపు యజమాని రేప్
వెల్లూరు: తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లా రాణిపేట సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై ఓ కిరాణా షాపు యజమాని(55) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తన అమ్మమ్మ కోసం నశ్యము తీసుకెళ్లేందుకు కిరాణా షాపుకు వచ్చిన సమయంలో నిందితుడు గోవిందస్వామి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం రాత్రి 8గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.
చాక్లెట్ ఇస్తానని తన ఇంటికి తీసుకెళ్లిన గోవిందస్వామి ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దుకాణానికి వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె పిన్ని.. చిన్నారి కోసం ఆ దుకాణం వద్దకు వెళ్లింది. కాగా, ఆ దుకాణంలో ఎవరూ లేకపోవడంతో యజమాని ఇంటికి వెళ్లింది.
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడుతుండటం చూసిన ఆమె.. గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. బాధిత చిన్నారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.