ఫుల్లుగా తాగొచ్చిన వరుడు: ఛీ కొట్టిన వధువు, ఆగిన పెళ్లి
కాన్పూర్: తాగి పెళ్లి పీటల మీదికి వచ్చిన వరుడుని వధువు ఛీకొట్టింది. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఆమె నిరాకరించింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో గల అజ్నార్ అనే గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
రమ (పేరు మార్చడం జరిగింది) అనే అమ్మాయికి అరవింద్ అనే అబ్బాయితో వివాహం కుదిరింది. మంగళవారంనాడు వారి వివాహం ఓ కళ్యాణమండపంలో జరగాల్సి ఉండింది. అయితే, వరుడు అదే రోజు మద్యం సేవించి వచ్చాడు. పైగా అమ్మాయి తరఫువారితో గొడవకు దిగాడు. సోదురులపై, బంధువులపై దాడి చేశాడు.
అబ్బాయికి అతని తల్లిదండ్రులు కూడా వత్తాసు పలికారు. దాంతో రమ తనకు ఈ పెళ్లి అవసరం లేదని కళ్యాణ మండపం నుంచి తమ వారందరినీ తీసుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత పెళ్లి కొడుకు తరఫువారు కూడా చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మంత్రాలు చదువుతున్న పూజారి డిజె సంగీతాన్ని ఆపేయాల్సిందిగా వధువు కుటుంబ సభ్యులకు సూచించాడు. దాంతో వారు మ్యూజిక్ ఆపేశారు. అందుకు గాను తాగి ఉన్న అరవింద్, అతని బంధువులు ఘర్షణకు దిగారు. వరుడి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే, మద్యం సేవించిన వ్యక్తిని అమ్మాయి పెళ్లి చేసుకోనని చెప్తే దానికి తామేం చేస్తామని పోలీసులు వారిని వెనక్కి పంపించారు.