లైటింగ్ సరిగా లేదని గొడవకు దిగిన వరుడు: పెళ్లి రద్దు చేసిన వధువు
కాన్పూర్: లైటింగ్ ఏర్పాట్లు సరిగా లేవని వరుడు గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా ఘర్షణకు దిగడంతో పెళ్లి మండపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వధువు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదంతా చూసి ఆగ్రహించిన వధువు అతడ్ని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. దీంతో పెళ్లి రద్దయింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా జిల్లాలోని ఖేడా అజబ్ సింగ్ గ్రామంలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన విజయ్ సింగ్కు, ఖేడా అజబ్ సింగ్ గ్రామానికి చెందిన నట్టు సింగ్ కూతురుకు బుధవారం వివాహం నిశ్చయించారు. కాగా, వివాహం ముందు చేసే కార్యక్రమం ‘జైమాల్' కోసం వధువు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు.
వివాహ వేదిక వద్దకు వచ్చిన వరుడి బంధువులు జైమాల్ వేడుకలో లైటింగ్ ఏర్పాట్లు సరిగా లేవని, మరింతగా లైటింగ్ పెంచాలని డిమాండ్ చేశారు. దీనిపై వరుడు కాబోయే మామతో గొడవకు దిగాడు. అయితే తాము ఇంతకన్నా ఎక్కువగా లైటింగ్ ఏర్పాటు చేయలేమని వరుడి మామ చెప్పాడు.
ఈ నేపథ్యంలో వరుడు, అతని బంధువులు వధువు కుటుంబసభ్యులు ఘర్షణకు దిగారు. దీంతో వధువు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అక్కడి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. కాగా, తమ కుటుంబం పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వరుడితో తాను వివాహం చేసుకోనని వధువు తేల్చి చెప్పింది. వధువు నిర్ణయానికి ఆమె కుటుంబసభ్యులు కూడా మద్దతు పలకడంతో పెళ్లి రద్దయిపోయింది.