ప్రభుత్వం లెక్కలు: ఎనిమిది ప్రధాన రంగాల్లో పడిపోయిన వృద్ధి రేటు
న్యూఢిల్లీ: ఎనిమిది ప్రధాన రంగాల్లో వృద్ధి రేటు జూలై నెలకు 2.1శాతానికి తగ్గిందని ప్రభుత్వం ఒక నివేదిక ద్వారా తెలిపింది. ఈ వృద్ధి గతేడాది ఇదే జూలై నెలకు 7.3శాతంగా ఉండేదని వెల్లడించింది. ఇక ప్రభుత్వం సమర్పించిన నివేదిక ప్రకారం బొగ్గు, ముడిచమురు, సహజ గ్యాస్, రిఫైనరీ ఉత్పత్తి రంగాల్లో వృద్ది పతనం దిశగా సాగిందని పేర్కొంది.
బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఫర్టిలైజర్లు, స్టీల్, సిమెంట్, మరియు విద్యుత్ లాంటి 8 ప్రధాన రంగాల్లో గతేడాది జూలై నాటికి 7.3గా వృద్ధి నమోదైందని ప్రభుత్వం నివేదిక వెల్లడించింది. ఏప్రిల్ - జూలై నెలలో ఈ ఎనిమిది ప్రధాన రంగాల్లో వృద్ధి 3శాతం నమోదైంది. గతేడాది ఇది 5.9శాతంగా ఉండేదని పేర్కొంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సూచికలో ఈ ఎనిమిది ప్రధాన రంగాలు కలిపి 40.27శాతంగా ఉన్నాయి.స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల్లో వృద్ధి శాతం వరుసగా 6.6 శాతం, 7.9శాతం, 4.2శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 6.9శాతం, 11.2 శాతం, 6.7శాతంగా ఉండేదని స్పష్టం చేసింది.
ఇక ఫర్టిలైజర్ ఉత్పత్తి గతేడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో 1.5శాతంకు పెరిగిందని నివేదికలో పేర్కొంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతి నెలా క్రమంగా ఈ ఎనిమిది ప్రధాన రంగాల్లో వృద్ధి తగ్గుతూ వస్తోందని నివేదిక వెల్లడించింది. ఏప్రిల్లో 5.8శాతం నుంచి 5.2శాతానికి పడిపోయింది. మే నెలలో 0.7శాతం తగ్గి 4.3శాతానికి వృద్ధి రేటు పడిపోయింది. ఇక ఎనిమిది ప్రధాన రంగాల్లో ఐదు రంగాల్లో వృద్ధి రేటు పడిపోయిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అంటే ఆర్థిక వ్యవస్థ బలహీనంగా మారందని ప్రభుత్వ లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి.