రాష్ట్రాలకు రూ. 1.51 లక్షల కోట్ల జీఎస్టీ బకాయిలు: అంచనాలు తలకిందులు చేసిన కరోనా
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలతోపాటు మన దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభానికి గురైన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రక్రియలో భాగంగా కేంద్రం విధించిన లాక్డౌన్తో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జీఎస్టీ వసూళ్లు భారీ మొత్తంలో క్షీణించాయి. ఈ మేరకు పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేసింది.

కరోనాతో అంచనాలు తలకిందులు..
కరోనా లాక్డౌన్ కారణంగా ఆశించిన మొత్తం రాకపోగా.. అంచనాలు తారుమయ్యాయని తెలిపింది. సోమవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రాలకు మొత్తం 1.51 లక్షల కోట్లు జీఎస్టీ బకాయిల కింద చెల్లించాల్సి ఉందని తెలిపారు.

అత్యధికంగా మహారాష్ట్రకు జీఎస్టీ బకాయి..
జీఎస్టీ బకాయిల కింద అత్యధికంగా మహారాష్ట్రకు రూ. 22,485 కోట్లు చెల్లించాల్సి ఉందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కర్ణాటక రూ. 13,763 కోట్లు, ఉత్తరప్రదేశ్ ర. 11,742 కోట్లు, గుజరాత్ రూ. 11,563 కోట్లు, తమిళనాడు రూ. 11, 269 కోట్లతో మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి రూ. 5,424 కోట్లు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. మొత్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 1,51,365 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు.
Recommended Video

26 శాతమే వసూళ్లు..
పెండింగ్లో ఉన్న పరిహారం, భవిష్యత్ చర్యల గురించి ఆగస్టు 27న జరిగిన జీఎస్టీ మండలి 41వ సమావేశంలో చర్చించామని మంత్రి చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సారినికి మార్కెట్ రుణాలు తీసుకోవడం, జీఎస్టీ పరిహార కొరతను తీర్చడానికి రాష్ట్రాలకు రెండు మార్గాలను ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన లోటు రూ. 97 వేల కోట్లు కాగా, కరోనా వల్ల రూ. 1.38 లక్షల కోట్ల మేర లోటు ఏర్పడిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో 2020-21 సంవత్సరానికిగానూ జీఎస్టీ వసూళ్లు రూ. 6,90,500 కోట్లు వస్తాయని అంచనా వేసినప్పటికీ.. ఆగస్టు వరకు రూ. 1,81,050 కోట్లు మాత్రమే వచ్చాయని మంత్రి తెలిపారు. ఇది కేవలం 26.2 శాతమేనని వెల్లడించారు. తక్కువ పన్నుల వసూళ్లకు కరోనా మహమ్మారే ప్రధాన కారణమని తెలిపారు.












Click it and Unblock the Notifications