Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జీఎస్టీ ఎఫెక్ట్: భారత ఆర్థిక వ్యవస్థలో గేమ్ చేంజర్

ఎట్టకేలకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో నూతన శకం ఆరంభం కాబోతున్నది. 2.4 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల సామర్థ్యం గల భారత ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి.జీఎస్టీ అమలు ద్వారా

న్యూఢిల్లీ: భారతావనికి స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత 'ఒక దేశం, ఒక మార్కెట్, ఒక పన్ను' విధానం పేరిట తొలి అతిపెద్ద పన్ను సంస్కరణ అమలుకు మరో కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నది. ఈ క్షణాల కోసం దశాబ్ద కాలానికి పైగా యావత్ భారతావని వేచి చూడాల్సి వచ్చింది.

ఎట్టకేలకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో నూతన శకం ఆరంభం కాబోతున్నది. 2.4 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల సామర్థ్యం గల భారత ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో వేర్వేరుగా అమలులో ఉన్న పరోక్ష పన్నుల వ్యవస్థను పూర్తిగా రద్దుచేస్తూ ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద దేశం 'భారతదేశం'లో ఏకైక అతిపెద్ద పరోక్ష పన్నుల వ్యవస్థ అందుబాటులోకి రానున్నది.

GST: A game changer for the Indian Economy

ఇటీవల అమెరికాలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ.. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకు రాసిన వ్యాసంలో 'జూలై ఒకటో తేదీ నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రాబోతున్నది. ఒక్క నిర్ణయంతో 130 కోట్ల మంది జనాభా గల భారత్ ఏకం కానున్నది' అని పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్రం, స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని 17 రకాల పన్నులను రద్దుచేస్తూ.. ఏకైక జీఎస్టీ అమలు ద్వారా అంతర్గత టారిఫ్ అడ్డంకులను అధిగమిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ తనకు తాను పరివర్తన దిశగా చేస్తున్న సాహసోపేత నిర్ణయం అమలు చేయబోతున్నది.

కార్పొరేట్ సంస్థలు, వినియోగ దారుల అంచనాల ప్రకారం పన్ను సంస్కరణ వల్ల భారత వార్షిక ఆర్థిక ప్రగతి ఒకటి, రెండు శాతం అంతకంటే ఎక్కువ పెరుగుతుందని అంచనా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు దేనికవే పన్ను వసూళ్లలో స్వతంత్రత, సార్వభౌమత్వం కలిగి ఉన్న కేంద్ర, రాష్ట్రాలు, స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తూ... సమస్యలను అధిగమిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకు వచ్చి అమలు చేయబూనుకోవడంతో నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది.

జీఎస్టీ అమలుకే మోదీ సర్కార్ ప్రాధాన్యం ఇలా

ఈనాడు ప్రపంచ దేశాలన్నింటికి ఆదర్శంగా ఉండే అమెరికాలో జీఎస్టీ వంటి ఏకీక్రుత పన్ను వ్యవస్థ అమలులో లేదు. కానీ మోదీ సర్కార్ జీఎస్టీ అమలు కోసం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. దానికి నిదర్శనం పార్లమెంట్ సెంట్రల్ హాలు వేదికగా శుక్రవారం అర్ధరాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు వెంటరాగా, ప్రధాని నరేంద్రమోదీ జీఎస్టీ అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. గతంలో 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాలు భారీగా ప్రజా సమీకరణకు దారి తీసింది.

పలు ఆర్థిక లక్ష్యాలు సాధించగలమని భావిస్తున్న విధాన నిర్ణేతలు

జీఎస్టీ అమలులో పలు ఆర్థిక లక్ష్యాలను సాధించగలమని విధాన నిర్ణేతలు భావిస్తున్నారు. ఉత్పాదక రంగానికి ప్రోత్సాహాన్ని అందించడంతోపాటు ఎగుమతుల్లో పురోభివ్రుద్ధి సాధించేందుకు వీలు చిక్కుతుంది. ఉత్పత్తిలో మరింత పోటీ, అదనపు ఉద్యోగావకాశాల కల్పన, పెట్టుబడుల అనుకూల వాతావరణం మెరుగుపర్చడంతోపాటు పన్ను ఎగవేతలకు చెల్లుచీటి పలుకుతుంది. బిజినెస్ లావాదేవీలపై ఫిర్యాదులు తగ్గుముఖం పడతాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాటల్లో చెప్పాలంటే 'జీఎస్టీ' అమలు చేయడంతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత సమర్థవంతంగా, శక్తిమంతంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పటివరకు అసంఘటిత రంగంలో ఉన్న పలు విభాగాలు సంఘటిత రంగంలోకి రానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యయ సామర్థ్యం పెరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంచనావేస్తున్నారు.

వస్తు రవాణాకు తొలగిపోనున్న ఆటంకాలు

జీఎస్టీ అమలు చేయడం ద్వారా జీడీపీలో వ్రుద్ధి రేటు పెరుగుతుందని పేర్కొంటున్నారు. జీఎస్టీ అమలు ద్వారా ఉచిత వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం వంటిదేనని సీనియర్ కన్సల్టెంట్లు అభిప్రాయ పడుతున్నారు. జీఎస్టీ అమలుతో ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల మధ్య వస్తువుల రవాణాపై ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని పేర్కొంటున్నారు. జీఎస్టీ అమలులో చట్టపరమైన, న్యాయపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్తున్నారు. పన్ను రాయితీలపైనే చట్టపరమైన, న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయి. కానీ జీఎస్టీ అమలుతో ఈ సమస్య కనీస స్థాయికి తగ్గిపోనున్నది. జీఎస్టీ విధానం అమలులో పూర్తిస్థాయి విజయం సాధిస్తే భారతదేశంలో సులభ వాణిజ్యం తేలికవుతుంది. బహుళ అంచెలతో కూడిన పన్నుల వ్యవస్థకు తెర దించుతూ సరిహద్దు చెక్ పోస్టులను ఎత్తివేయడానికి దారి తీస్తుంది. ఇందుకోసం పన్ను అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ల మధ్య ముఖాముఖీ సమావేశం కావాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నారు

పారదర్శకతకు మార్గం ఇలా

కొన్ని ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్రాల పరిధిలో ఎంత పన్ను వసూలవుతుందన్నది తొలిసారి తేలనున్నది. కొన్ని అనూహ్య అంచనాలు, ముందస్తు ఊహించిన ప్రయోజనాలపై ఆశలు పెట్టుకున్నారు వినియోగదారులు. కొన్ని మినహాయింపులతో పన్నును కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముడి చమురు, పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, సహజ వాయువులను మినహాయించడంతోపాటు జీఎస్టీ.. 5, 12, 18, 28 శాతం పన్ను వసూలు చేయడానికి అంగీకారం కుదిరింది. ముడి చమురుతోపాటు మద్యం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా పన్ను సంపాదించి పెడుతున్నది. కొన్ని వస్తువులపై మాత్రమే అత్యధికంగా 28 శాతం పన్ను విధించాలని అధికార వర్గాలు తెలిపాయి.

సరఫరాలో నో ప్రాబ్లం

జీఎస్టీ అమలులోకి రావడం వల్ల కొన్ని వస్తువుల సరఫరాలో ఆటంకాలు ఉంటాయన్న అభిప్రాయాలను పన్ను చెల్లింపు నిపుణులు కొట్టి పారేస్తున్నారు. జీఎస్టీ అమలుకు ముందు వివిధ దుకాణాల్లో నిల్వ గల సామాగ్రిపై పన్ను వసూళ్లు సమస్యే కాదని పేర్కొంటున్నారు. రిటైల్ వ్యాపారం స్థాయిలో బిజినెస్ లావాదేవీల్లో ఎటువంటి సమస్యలు ఉండవని అంటున్నారు. జీఎస్టీ అమలు మొదలైన తర్వాత నిల్వలను తగ్గించి.. కొత్త ఆర్డర్ల ద్వారా నిల్వలు తెప్పిస్తారని, దీని ద్వారా సజావుగా పరివర్తన సాధించొచ్చునని పేర్కొన్నారు. కనుక వినియోగదారులకు వస్తువుల కొరత సమస్యే తలెత్తదని పేర్కొంటున్నారు.

రాజీ ఫార్ములా రూపుదిద్దుకున్నదిలా

జీఎస్టీ అమలులోకి రావాలన్న కల సాకారం కావడానికి దశాబ్ద కాలానికి పైగానే సమయం పట్టింది. రాష్ట్రాల మధ్య చర్చలు, సవాళ్లు, సమస్యలు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎడతెగని చర్చలు, లాబీయింగ్, రాజీ ఫార్ములాలపై విస్త్రుత స్థాయిలో చర్చలు జరిగాయి. పన్ను సంస్కరణకు 'జీఎస్టీ' అమలుతో ఒక సమాఖ్య పన్ను సంస్థ నెలకొల్పేందుకు దారి ఏర్పడింది. జీఎస్టీ కౌన్సిల్‌లో చైర్మన్‌గా కేంద్ర ఆర్థిక మంత్రి, సభ్యులుగా రాష్ట్ర మంత్రులకు చోటు ఉంది.

జీఎస్టీ అమలు ద్వారా వివిధ వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్తున్నారు. తాత్కాలికంగా ఇంధనంపై జీఎస్టీ విధించకుండా నిలిపివేశారు. ఇక మద్యం విక్రయాలపై సంస్థాగతంగా నూతన పన్ను విధానం నుంచి పక్కకు తప్పించారు. ఇప్పటివరకు స్వేచ్ఛగా పన్ను వసూళ్లు జరిపిన ప్రభుత్వాలు.. తమ ఉత్పత్తులపై పన్ను వసూళ్లను తేలిక చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించడానికి రాష్ట్రాలు రాజీ పడ్డాయి.

రాష్ట్రాలకు వస్తున్న ఆదాయంలో 40 శాతం పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తున్న పన్నుల ద్వారా వస్తున్నదే. కానీ జీఎస్టీ అమలులోకి రావడంతో రాష్ట్రాల ఆదాయం పడిపోతుంది. కనుక జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాల ఆదాయం స్థిరీకరించబడే వరకు 'పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ' విధించకూడదని నిర్ణయించారు. జీఎస్టీ అమలుకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామం అని, పలు అంశాలు గాడిలో పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+