'ప్రతి నెలా జీఎస్టీ అంచనా రూ.లక్ష కోట్లు, తగ్గుతూ వచ్చిన ఆదాయం'
ఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) ద్వారా వచ్చే ఆదాయం ప్రతి నెల లక్ష కోట్ల వరకు ఉండే అవకాశముందని కేంద్రం భావిస్తోంది. ప్రతి నెల లక్ష కోట్ల మార్కు దాటుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
పన్ను వివరాలు సరిపోల్చడం, ఎలక్ట్రానిక్ వే బిల్లు వంటి పన్ను ఎగవేత నివారణ చర్యలతో ఈ మేరకు జీఎస్టీ వ్యవస్థ గాడిన పడుతుందని ఆర్థిక శాఖ భావిస్తోంది.
గత ఏడాది జూలై 1న జీఎస్టీ అమల్లోకి రాగా తొలి నెలలో రూ.95వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని, ఆ తర్వాత నెల నెలా తగ్గుతూ వచ్చింది. గత ఏడాది డిసెంబర్ నెలలో జీఎస్టీ ఆదాయం 6703 కోట్లకు క్షీణించింది.
ఆదాయంలో గణనీయమైన తగ్గుదల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమయింది. బంగారం క్రయ విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి పెట్టింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక తొలి ఎనిమిది నెలల్లో రూ.4 లక్షల 44వేల కోట్ల ఆదాయం వచ్చింది. 2018-19లో రూ.7 లక్షలకు పైగా వస్తుందని కేంద్రం అంచనా వేసింది.