మోడీ-అమిత్ షా సొంత రాష్ట్రం మరి: 600 పోస్టుల కోసం వేలాదిమంది నిరుద్యోగులు: లాఠీఛార్జ్
అహ్మదాబాద్: గుజరాత్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం. దేశంలోనే అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా పేరు పొందింది. పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉందని, పెట్టుబడులు కుప్పలు తెప్పలుగా గుజరాత్కు తరలి వెళ్తుంటాయని చెబుతుంటారు. దీనికి సంబంధించిన అనేక వార్తలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు గుజరాత్కు చెందినవే.
గుజరాత్ మోడల్ను అన్ని రాష్ట్రాలకూ వర్తింపజేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో స్పష్టం చేసింది కూడా. అలాంటి రాష్ట్రంలో నిరుద్యోగ శాతం విపరీతంగా పెరిగిపోయింది. నిరుద్యోగుల సంఖ్య అంచనాలకు మించి ఉంటోంది. ఉపాధి దొరక్క మహారాష్ట్ర, నోయిడా, గుర్గావ్, ఢిల్లీ వంటి ప్రాంతాలకు తరలి వెళ్తోన్నారు గుజరాత్కు చెందిన నిరుద్యోగులు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతాన్ని దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
బనస్కాంత జిల్లాలోని పాలన్పూర్లో గ్రామ రక్షా దళాల పోస్టులను భర్తీ చేయడానికి నిర్వహించిన ప్రక్రియ.. రక్తసిక్తమైంది. 600 పోస్టుల కోసం వేలాదిమంది నిరుద్యోగులు ఎగబడ్డారు. రాత్రంతా పడిగాపులు పడ్డారు. వారికి కనీస సౌకర్యాలను కూడా కల్పించలేకపోయింది గుజరాత్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రోడ్ల మీదే గడిపారు నిరుద్యోగులు. గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు.
నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ ఇంటర్వ్యూల కోసం హాజరువుతారని ముందే తెలిసినప్పటికీ.. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలను తీసుకోలేదు. కనీసం వసతిని కల్పించడంలో విఫలమైంది. వేల సంఖ్యలో హాజరైన నిరుద్యోగులను నియంత్రించడానికి పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. ఈ లాఠీఛార్జీలో పలువురు అభ్యర్థులు గాయపడ్డారు. ఇంటర్వ్యూ ప్రక్రియను చేపట్టడానికి గంటలపాటు నిరీక్షించాల్సిన దుస్థితి రావడంతో నిరుద్యోగుల్లో అసహనం వ్యక్తమైంది.
#Watch | Gujarat: A large number of people gathered in Banaskantha's Palanpur area for 600 posts of Gram Raksha Dal pic.twitter.com/5XICnjkBks
— ANI (@ANI) November 27, 2021
గ్రామ రక్షా దళాల్లో పని చేయడానికి కనీస అర్హత.. 5వ తరగతి. అయిదో తరగతి పాస్ అయినా చాలు.. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి రోజూ 250 రూపాయల చొప్పున భత్యాన్ని ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత..ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో వేర్వేరు ప్రాంతాలు, రాష్ట్రాల్లో నివసించిన వేలాదిమంది గుజరాతీయులు తమ స్వస్థలాలకు తరలి వెళ్లారు. వారంతా గ్రామ రక్ష దళాల్లో పని చేయడానికి రావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు.