గుజరాత్ ఎన్నికలు: ఏబీపీ, సీఎస్ డీఎస్ పోల్ సర్వే యూటర్న్, మోడీ, అమిత్ షాకు !
Recommended Video
న్యూఢిల్లీ: గుజరాత్ లో బీజేపీ గెలుపు నల్లేరుమీద నడకే అని ఇంతకాలం అనుకున్న ఆపార్టీ నేతలు ఇప్పుడు షాక్ కు గురౌతున్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇస్తోందని సర్వేలు చెప్పడంతో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. తాజా సర్వే యూటర్న్ కావడంతో గుజరాత్ బీజేపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైయ్యింది.
గత సర్వేలలో బీజేపీకి !
గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. గుజరాత్ శాసన సభ ఎన్నికలు ఇరు పార్టీల మధ్య ప్రతిష్టాత్మక పోరుకు అద్దం పడుతున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే అనేక సర్వేలు బీజేపీకి విజయం కట్టబెట్టాయి. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం లేదని గత సర్వేలు తేల్చి చెప్పాయి.
ఏబీపీ-సీఎస్ డీఎస్ సర్వే !
గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 43 శాతం ఓట్లు పోలవుతాయని తాజాగా ఏబీపీ న్యూస్ కోసం లోక్ నీతి- సీఎస్ డీఎస్ చేసిన పోల్ సర్వే లో వెలుగు చూసింది. గుజరాత్ లో 182 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. గుజరాత్ లో బీజేపీకి 91 నుంచి 99 సీట్లు వచ్చే అవకాశం ఉందని లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే తెలిపింది.
చాల వ్యత్యాసం ఉంది !
2012 శాసన సభ ఎన్నికలతో పోల్చుకుంటే 2017 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నది. ఆ పార్టీకి 78 నుంచి 86 స్థానాలు దక్కే అవకాశం ఉందని లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే చెప్పంది. అయితే లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే గతంలో విడుదల చేసిన సర్వేకి ఇప్పటి సర్వేకి చాల వ్యత్యాసం ఉంది.
ఆగస్టు - డిసెంబర్ కు ఇంత తేడానా ?
ఆగస్టు నెలలో లోక్ నీతి-సీఎస్ డీఎస్ చేసిన సర్వేలో బీజేపీకి కచ్చితంగా 150 సీట్లుకు పైగా వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 30 సీట్లకే పరిమితం అవుతోందని సర్వే విడుదల చేసింది. అయితే ఇప్పుడు హార్దిక్ పటేల్, దళిత, బీసీ వర్గాల నాయకుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుందని లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే చెబుతోంది.
బీజేపీకి జీఎస్ టీ దెబ్బ ?
కేంద్రం ప్రవేశ పెట్టిన జీఎస్ టీ వ్యాపారుల్లో నెలకొన్న వ్యతిరేకత కూడా బీజేపీ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నదని ఏబీపీ న్యూస్ కోసం లోక్ నీతి-సీఎస్ డీఎస్ నిర్వహించిన సర్వేలో వెలుగు చూసింది. తాజా సర్వే విడుదల కావండంతో గుజరాత్ లోని కాంగ్రెస్ నాయులు కొత్త ఉత్సాహంతో ప్రచారం ముమ్మరం చేశారు.
అక్కడ కాంగ్రెస్ కింగ్ !
గుజరాత్ ఉత్తర ప్రాంతంలో 55 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 49 శాతం ఓట్లు వస్తాయని, బీజేపీ కేవలం 45 శాతం ఓట్లతో సంతృప్తి చెందాలని సర్వే అంటోంది. మొదటి విడత పోలింగ్ కు కేవలం నాలుగు రోజుల మాత్రం సమయం ఉండటంతో గుజరాత్ ఉత్తర ప్రాంతంలోని బీజేపీ అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైయ్యింది.