ఇది పచ్చి నిజం: ముస్లింల ఊసే లేదు.. హిందుత్వ పట్ల కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్

న్యూఢిల్లీ/ అహ్మదాబాద్: ఈ నెల 9, 14 తేదీల్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం భారీ కసరత్తు చేసిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. ఈ దఫా తనకు సంప్రదాయ ఓటు బ్యాంకుగా భావిస్తున్న ముస్లింల ఊసే ఎత్తడం లేదు. గుజరాతీల్లో బలమైన సామాజిక వర్గం.. దాదాపు మూడు దశాబ్దాల పాటు కమలనాథులకు కంచుకోటగా మారిన పాటిదార్లు.. వారికి తోడుగా క్షత్రియులు తదితర ఓబీసీ సామాజిక వర్గాలు.. దళిత, గిరిజనుల దన్నుతో అధికార పీఠానికి దగ్గరయ్యేందుకు అవసరమైన ఎత్తులు వేస్తున్నది 'హస్తం' పార్టీ.
కానీ రాష్ట్ర జనాభాలో 10 వంతు గల ముస్లింల ఊసే ఎత్తకుండా కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాన్ని అమలుచేస్తుండటం ఆసక్తికర పరిణామమే మరి. హిందూ సామాజిక వర్గ ఓట్లను బీజేపీ గంపగుత్తగా కొల్లగొట్టే పరిస్థితి రాకుండా ఉండేందుకే కాంగ్రెస్ అధి నాయకత్వం.. ముస్లింల అనుకూల వైఖరి ప్రదర్శించడం లేదు.

యువ నేతలకు కాంగ్రెస్ ఇలా ‘స్నేహ’ హస్తం

యువ నేతలకు కాంగ్రెస్ ఇలా ‘స్నేహ’ హస్తం

ఈ దఫా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మతాల ప్రాతిపదికన కాక కులాలు.. వివిధ సామాజిక వర్గాల మధ్య రాజకీయ పునరేకీకరణ దిశగా సాగుతున్నాయి. సీట్ల సర్దుబాటులో పాటిదార్ల యువ నేత హార్దిక్ పటేల్, ఓబీసీ హక్కుల పరిరక్షణ నాయకుడు అల్పేశ్ ఠాకూర్, దళిత హక్కుల కార్యకర్త కం న్యాయవాది జిగ్నేశ్ మేవానీ మనస్సులు చూరగొనడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు చెందిన యువతరాన్ని తమ అక్కున చేర్చుకునేందుకు ‘స్నేహ' హస్తం అందించింది. యంగ్ టర్క్‌లుగా పేరొందిన హార్దిక్ పటేల్ - అల్పేశ్ ఠాకూర్ - జిగ్నేశ్ మేవానీ డిమాండ్లకు తలొగ్గింది కాంగ్రెస్ పార్టీ. గత ఆగస్టులో జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నైతిక మద్దతునిచ్చిన చోటు వాసవ వంటి గిరిజన నేతలను తన దరికి చేర్చుకున్నది. తొలిదశ పోలింగ్ జరిగేలోగా ప్రకటించే ‘ఎన్నికల మ్యానిఫెస్టో'లో ముస్లింల డిమాండ్లు చేర్చే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ‘కాంగ్రెస్ పార్టీతో ముందు పీఠిన ముస్లింలు ఉంటారా? తెర వెనుకే ఉంటారా? అన్న అంశంతో సంబంధం లేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలో విజయం సాధించి అధికారం చేపట్టడమే తొలి ప్రాధాన్యం. ఇందులో ఎటువంటి తేడా లేదు' అని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత బద్రుద్దీన్ షేక్ చెప్పారు. గెలుపు భావుటాకే తొలి ప్రాధాన్యం అని, మిగతా అంశాలన్నీ తర్వాతేనని ఆయన తేల్చి చెప్పారు. అలాగని ముస్లింల ఓట్లకు ప్రాధాన్యం లేదని కాదు, ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న ముస్లింలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలుస్తారని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ముస్లింల ప్రాబల్య ప్రాంతంలో సీఎం విజయ్ రూపానీ రోడ్ షో

ముస్లింల ప్రాబల్య ప్రాంతంలో సీఎం విజయ్ రూపానీ రోడ్ షో

గత రెండు నెలలుగా గుజరాత్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విస్త్రుతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తన ప్రచార మార్గంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ హిందువుల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ముస్లింల ప్రాభల్యం గల ప్రాంతాల్లో తిరుగనే లేదు. కానీ అధికార బీజేపీ తరఫున రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ మాత్రం అహ్మదాబాద్ నగరంలో ముస్లింలు అత్యధికంగా జీవిస్తున్నజమల్పూర్ - ఖాడియా ప్రాంతంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఇక వస్త్ర ప్రపంచానికి, వజ్రాభరణాల వ్యాపారానికి నెలవైన సూరత్ నగరంలో మైనారిటీ మోర్చా నాయకులు ముస్లింల నివాస ప్రాంతాల్లో విస్త్రుత ప్రచారం చేపట్టినా ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టిక్కెట్ ఇవ్వకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరుగురు అభ్యర్థులకు చోటు కల్పించింది. 2011 జన గణన ప్రకారం రాష్ట్ర జనాభాలో ముస్లింలు 9.6 శాతం కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అనుకూలురిగా ముద్ర పడిన అబ్దుల్ హఫీజ్ లఖానీ, జుబేర్ గోపాలానీ వంటి సామాజిక, రాజకీయ కార్యకర్తలు ముస్లింల పట్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారని సమాచారం. అధికారంలో బీజేపీ ఉన్నందున కాంగ్రెస్ పార్టీ యాద్రుచ్ఛికంగానే ముస్లింల అనుకూల పార్టీగా ముందు ఉంటుందని అబ్దుల్ హఫీజ్ లఖానీ, జుబేర్ గోపాలానీ అభిప్రాయ పడుతున్నారు.

బీజేపీ పునరేకీకరణ యత్నాలు ఇలా తటస్థీకరణ

బీజేపీ పునరేకీకరణ యత్నాలు ఇలా తటస్థీకరణ

తొలిసారి కాంగ్రెస్ పార్టీ హిందువుల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నదని బహిరంగంగా ప్రజలే చెప్తున్నారని గుర్తు చేస్తున్నారు. తద్వారా హిందువులను రాజకీయంగా పునరేకీకరణ దిశగా బీజేపీ అడుగులు వేయకుండా ‘తటస్థీకరించారు' అన్న అభిప్రాయం జనంలో వ్యక్తం అవుతున్నది.ఇటీవల ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న ముస్లిం యువకుడిని ఐఎస్ సంస్థతో గల అనుబంధంపై పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ ఆస్పత్రి యాజమాన్యంతో ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్‌కు అనుబంధం కలిగి ఉండటంతో సదరు యువకుడికి, కాంగ్రెస్ పార్టీకి లింక్ కలిపేందుకు విజయ్ రూపానీ సర్కార్ ప్రయత్నించిన సంగతిని రాజకీయ విశ్లేషకులు, వ్యూహకర్తలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కులాల వారీగా సాగిన ఆందోళనలు.. అధికార బీజేపీ వ్యూహాన్ని అధిగమించేశాయి. ఈ దఫా విజయం కోసం కమలనాథులు అనుసరిస్తున్న వ్యూహం సక్సెస్ కాబోదని అబ్దుల్ హఫీజ్ లఖానీ విశ్వాసం వ్యక్తం చేశారు.

తమకు న్యాయం కావడమే ముఖ్యమన్న ముస్లిం మైనారిటీలు

తమకు న్యాయం కావడమే ముఖ్యమన్న ముస్లిం మైనారిటీలు

ఎన్నికల వ్యూహంలో భాగంగా అఖిల ముస్లిం మజ్లిస్ ముషావరత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాన్ని ముస్లింలు అభ్యంతర పెట్టొద్దని ఈ సమావేశానికి హాజరైన నేతలు చెప్పినట్లు సమాచారం. మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జుజార్ బందూక్ వాలా కూడా ఈ వ్యూహం అమలు నిజమేనని అంగీకరించారు. మరోవైు సూఫీ ముస్లిం, న్యాయ హక్కుల కార్యకర్త అన్వర్ షేక్ స్పందిస్తూ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అణచివేస్తున్నదని వ్యాఖ్యానించారు. ముస్లింల పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. ముస్లింల ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడతాయని ఆ సామాజిక వర్గం ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. అత్యధిక ముస్లింలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, స్థానిక కాంగ్రెస్ నేతలు తమ బస్తీల్లోకి రావడం ముఖ్యం కాదని.. అందరికీ న్యాయం చేయడమే ముఖ్యమని అభిప్రాయ పడుతున్నారు. తామంతా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని తేల్చి చెప్తున్నారు.

థామాషా పద్దతిలో అసెంబ్లీలో ముస్లింలకు లభించని ప్రాతినిధ్యం

థామాషా పద్దతిలో అసెంబ్లీలో ముస్లింలకు లభించని ప్రాతినిధ్యం

వడోదరలోని మండ్వీ చౌక్‌లో బట్టల దుకాణం నడుపుతున్న ఇబ్రహీం కపాడియా స్పందిస్తూ ‘కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నది. కానీ బీజేపీ పరిస్థితి అందుకు భిన్నం. మైనారిటీలు, ప్రత్యేకించి ముస్లింలతో మమేకం కావడం సర్దుబాటు కావడం కష్టమే' అని చెప్పారు. అహ్మదాబాద్ వాసి ముఖ్తియార్ షేక్ స్పందిస్తూ ప్రస్తుత వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే సరైన వేదిక అని, ముస్లింల నివాస ప్రాంతాల్లోకి కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లడం వల్ల వారిపైనే ప్రధాన చర్చ జరుగడం ముఖ్యం కాదన్నారు. రాష్ట్ర జనాభాలో 10 వంతుగా ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి ఏనాడూ థామాషా నిష్పత్తిలో అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించలేదన్న విమర్శ మొదటి నుంచే ఉన్నది. 1980లో అత్యధికంగా 12 మంది ఎమ్మెల్యేలుగా ముస్లింలు ఎన్నికైతే, 1985లో అది ఎనిమిది మందికి పడిపోయింది. 1990, 2012లో ఇద్దరేసి ముస్లిం నేతలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 1995లో అతి తక్కువగా ఒక్కరు, 1998లో ఐదుగురు, 2002లో ముగ్గురు, 2007లో ఐదుగురు ముస్లింలు అసెంబ్లీలో అడుగు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+