12న రెండోసారి గుజరాత్ సీఎంగా భూపేంద్ర: ప్రధాని మోడీ, అమిత్ షా హాజరు
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు ఏకపక్ష ఏడోసారి రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు.
డిసెంబర్ 12న జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.1995 నుంచి గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ తన అధికారాన్ని నిలుపుకుంటూ వస్తోంది. అయితే, ఎప్పుడూ లేని విధంగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 156 అసెంబ్లీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. గుజరాత్ అసెంబ్లీ మొత్తం 182 స్థానాలున్నాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ విస్తృత ప్రచారం చేసిన విషయం తెలిసింద. 30కిపైగా ర్యాలీల్లో ప్రధాని మోడీ పాల్గొని బీజేపీకి మరోసారి అధికారాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయోత్సవ సంబరాలు చేసుకునేందుకు గురువారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఇప్పటికే మోడీ, అమిత్ షా.. గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
గుజరాత్ రాష్ట్రానికి డిసెంబర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తొలి దశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు ఎన్నికల నిర్వహించారు. గురువారం ఫలితాలు వెలుడ్డాయి. బీజేపీ 156 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 17, ఆమ్ ఆద్మీ పార్టీ 5 సీట్లకు పరిమితమయ్యాయి.
ఈ ఎన్నికల్లో 64.33 శాతం ఓటింగ్ నమోదైంది, ఇది 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే దాదాపు 4 శాతం తక్కువ. 4.9 కోట్ల మంది నమోదైన ఓటర్లలో, 2022 ఎన్నికల్లో కేవలం 3.16 కోట్ల మంది మాత్రమే ఓటు వేశారు.