ఫస్ట్ పొలిటికల్ డెత్?: కరోనా వైరస్ వల్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి
అహ్మదాబాద్: కరోనా వైరస్ బారిన పడి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడొకరు మరణించారు. కరోనా వైరస్ బారిన పడి ఓ రాజకీయ నాయకుడు మరణించడం ఇదే తొలిసారి. గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, అహ్మదాబాద్ కార్పొరేటర్ బద్రుద్దీన్ షేక్ ఆదివారం రాత్రి మరణించినట్లు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్ గోహిల్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల పాటు ఆయన పనిచేశారని, ఆయన లేని లోటును తీర్చలేనిదని సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Recommended Video
68 సంవత్సరాల బద్రుద్దీన్ షేక్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గా పని చేశారు. అహ్మదాబాద్లోని బెర్హంపూర్ వార్డు నుంచి ఆయన ఎన్నిక అయ్యారు. ఆయనకు హైబీపీ, డయాబెటిక్ ఉన్నాయి. అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను ఈ నెల 15వ తేదీన కుటుంబ సభ్యులు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది.
అప్పటి నుంచి ఆయన ఐసొలేషన్ వార్డులో ఉంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందినట్లు గోహిల్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో అధికార భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని గుజరాత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఓ కార్పొరేటర్ స్థాయి నాయకుడే వైరస్ వల్ల మరణిస్తే.. ఇక సాధారణ ప్రజల మాటేమిటని నిలదీస్తున్నారు.
ఏపీ రాజ్భవన్లో కలకలం: నలుగురికి పాజిటివ్
గుజరాత్లో కరోనా వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని, వాటిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ..గుజరాత్కే చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంపై ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ చూపించట్లేదని మండిపడుతున్నారు. కరోనా వైరస్ సోకినప్పటికీ..వెనుకాడకుండా నిత్యం ప్రజల సంక్షేమం కోసం బద్రుద్దీన్ షేక్ పని చేశారని అన్నారు.