రాహుల్ అవి రాజ్యాంగ హక్కులన్నారు.. దళితుల డిమాండ్పై జిగ్నేశ్ మేవానీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అదే దళిత హక్కుల నేత జిగ్నేశ్ మేవానీ అంటే అతిశయోక్తి కాదు.
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తమ డిమాండ్లలో 90 శాతం అంగీకరించారని దళిత హక్కుల ఉద్యమ నేత జిగ్నేశ్ మేవానీ తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీని ఓడించాలని తమ సామాజిక వర్గ ప్రజలను కోరతానని జిగ్నేశ్ మేవానీ చెప్పారు. 2015లో గో రక్షణ పేరిట ఉనాలో నలుగురు దళిత యువకులను చిత్ర హింసలు పెట్టిన ఘటనతో ఆ సామాజిక వర్గంలో వేడి పెరిగింది.
దళితుల హక్కుల కోసం న్యాయవాది జిగ్నేశ్ మేవానీ పోరాడుతూ వచ్చారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై తమ డిమాండ్లపై చర్చించిన మీదట తమ డిమాండ్లలో 90 శాతానికి పైగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టేందుకు అంగీకరించారని ప్రకటించారు.
దళితుల సమస్యలపై జిగ్నేశ్ మేవానీ ఇలా
‘జిగ్నేశ్, పాటిదార్ల రిజర్వేషన్ కోటా కోసం హార్దిక్ పటేల్, ఓబీసీ హక్కుల పోరాటం కోసం అల్పేశ్ ఠాకూర్ ప్రతి ఒక్కరి సమస్యలు వినడంతోపాటు వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం' అని రాహుల్ గాంధీతో భేటీ తర్వాత మీడియాతో జిగ్నేశ్ మేవానీ పేర్కొన్నారు. మరోవైపు బీజేపీకి కేవలం దాని ‘మన్ కీ బాత్' వినడంపైనే ద్రుష్టి సారించిందని ప్రధాని నరేంద్రమోదీ ‘మన్ కీ బాత్' కార్యక్రమాన్ని ఎద్దేవాచేశారు. నవ్సారిలోని ఒక ఫామ్హౌస్లో రాహుల్ గాంధీతో అర్ధగంట సేపు జిగ్నేశ్ మేవానీ సమావేశమయ్యారు. గుజరాత్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా మారిందన్నారు.
మా డిమాండ్లను పట్టించుకోలేదన్న జిగ్నేశ్
‘ఉనా ఘటన నుంచి పలు ఆందోళనలు నిర్వహించాం. వినతిపత్రాలు సమర్పిస్తూ వచ్చాం. దళితులకు వ్యతిరేకంగా, ప్రజల వ్యతిరేక ప్రభుత్వమే కాదు మొండి ప్రభుత్వం కూడా. ప్రభుత్వం మా డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడానికి అంగీకరించలేదు. వారికి మా డిమాండ్లు అంటే లెక్కే లేదు' అని వ్యాఖ్యానించారు. గుజరాతీలంతా బీజేపీ అహంకారం కింద మగ్గుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం దళితుల డిమాండ్లను స్వీకరించడానికి సిద్ధ పడింది' మేవానీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చేరుస్తామని హామీ ఇచ్చారు
‘రాహుల్జీతో మా 17 డిమాండ్లపై నేను, ఇతర దళిత నాయకులు సవివరంగా చర్చించాం. రాహుల్ మా డిమాండ్లు పూర్తిగా వినడమే కాదు. అవన్నీ 90 శాతానికి పైగా రాజ్యాంగ హక్కులు అని వ్యాఖ్యానించారు. చట్టబద్ధమైన మా డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని జిగ్నేశ్ మేవానీ హామీ ఇచ్చారు. వాటిని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే ఎన్నికల మ్యానిఫెస్టోలో చేరుస్తామని హామీ ఇచ్చారు' అని జిగ్నేశ్ మేవానీ తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని దళితులను తాను కోరానని చెప్పారు.
తాన్గఢ్లో కాల్పులపై విచారణ నివేదిక బహిర్గతం చేయాలి
రాహుల్ గాంధీకి దళితుల సమస్యలపై 17 డిమాండ్లను సవివరంగా వివరించానని జిగ్నేశ్ మేవానీ తెలిపారు. నిరుపేద దళితులకు ఐదెకరాల భూమి కేటాయింపు, దళితులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, సురేంద్ర నగర్ జిల్లా తాన్గఢ్లో దళితులపై కాల్పుల ఘటనపై విచారణ నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని జిగ్నేశ్ మేవానీ ప్రకటించారు. కానీ ఓబీసీల హక్కుల కోసం పోరాడిన అల్పేశ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరోవైపు పాటిదార్ల నాయకుడు హార్దిక్ పటేల్తో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతోంది.