గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసిన రాహుల్ గాంధీ: బీజేపీపై విమర్శలు
గాంధీనగర్: బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం పనిచేస్తోందని, ప్రజల కోసం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సోమవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సూరత్ నుంచి ప్రారంభించారు. భారత్ జోడో యాత్ర మధ్యలో వచ్చి ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం గుజరాత్లో తమకు కలిసి వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న రాహుల్.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని రాహుల్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా నిరుద్యోగం కూడా పెరిగిపోయిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. గిరిజనులకు చెందిన భూములను పారిశ్రామిక పెద్దలకు కట్టబెడుతున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. గిరిజనులను బీజేపీ మోసం చేస్తుందని మండిపడ్డారు. లాక్కున్న భూములన్నింటినీ తాము అధికారంలోకి వస్తే తిరిగిస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాహుల్ గాంధీ కోరారు. కాగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నవంబర్ 26-27 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రంలో తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. గుజరాత్ అభివృద్ధి, సంక్షేమాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వస్తున్నారని, వారిని శిక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాగా, గుజరాత్ రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1, డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు డిసెంబర్ 8న గుజరాత్ ఫలితాలు కూడా వెలువడనున్నాయి.