సోమనాథ్ ఆలయం విజిటర్స్ బుక్కులో నాన్ హిందూగా రాహుల్
న్యూఢిల్లీ: గుజరాత్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. గుజరాత్లోని సోమనాథాలయంలో విజిటర్స్ బుక్కులో రాహుల్ గాంధీ పేరు నాన్ హిందువుగా నమోదై ఉంది.
మీడియా సమన్వయకర్త మనోజ్ త్యాగి సందర్శకుల రిజిష్టర్లో ఎంట్రీ చేశారు. అయితే ఆయన పేరు తర్వా రాహుల్ గాంధీ సంతకం మాత్రం కనిపించలేదు. రాహుల్ గాంధీతో పాు అహ్మద్ పటేల్, సోనియా గాంధీ కూడా ఉన్నారు.
రిజిష్టర్లో ఆయన పేరు మాత్రం ఉంది. ఈ వార్త బయటకు పొక్కగానే స్థానిక కాంగ్రెసు నాయకులు ఎంట్రీని పరిశీలించడానికి వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఆలయాలను సందర్శించడాన్ని బిజెపి ఎద్దేవా చేస్తూ వస్తోంది.
బిజెపి, ఆర్ఎస్ఎస్ హిందూత్వను ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ ఆలయాలు సందర్శిస్తున్నారని కాంగ్రెసు చెబుతూ వస్తోంది. రాహుల్ గాంధీ క్రైస్తవుడనే అనుమానం తనకు ఉందని, 10 జనపథ్లో రాహుల్ గాంధీ క్రైస్తవాన్ని ఆచరిస్తారనే సందేహం ఉందని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల అన్నారు. తాను హిందువునని రాహుల్ గాంధీ తొలుత ప్రకటించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ ఎట్టకేలకు తాను హిందువును కాదని అంగీకరించారంటూ దీనిపై బిజెపి ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవ్యా ట్వీట్ చేశారు. విశ్వాసాల పరంగా ఆయన హిందువు కాదన్నది అర్థమైందని, దేవాలయాలను సందర్శిస్తూ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు.తన ఎన్నికల అఫిడవిట్లో తాను హిందువును అని రాహుల్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.
దీనిపై కాంగ్రెస్ మీడియా సమన్వయకర్త మనోజ్ త్యాగి వెంటనే ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయం లోపలికి మీడియా ప్రతినిధులను తీసుకెళ్లేందుకు మాత్రమే తన పేరును సంతకం చేశానని, అందులో రాహుల్ పేరు గానీ, అహ్మద్ పేరు గానీ పేర్కొనలేదని తెలిపారు. ఆ తర్వాత ఎవరో వాటిని నమోదు చేశారంటూ వివరణ ఇచ్చారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంలో భాగంగా రాహుల్ గాంధీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆయన సందర్శనను ప్రధాని మోడీ తప్పుబట్టారు. ఆలయ నిర్మాణం పట్ల మాజీ ప్రధాని నెహ్రూ అయిష్టత వ్యక్తంచేశారని, గతాన్ని మరిచి ఇప్పుడు వారి వారసులు సోమనాథ్ ఆలయాన్ని సందర్శిస్తున్నారని అన్నారు.