ఫేస్బుక్ పెళ్లిళ్లు నిలబడవు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ‘పెళ్లైన 2నెలలకే వేధింపులు’
అహ్మదాబాద్: అతను లేదా ఆమె.. ఎవరు? ఎలాంటివారు? అతని గురించి పూర్తిగా తెలియకున్నా సోషల్ మీడియా కారణంగా వ్యక్తుల మధ్య పరిచయాలు పెరిగిపోతున్నాయి. ఈ పరిచయాలు కొంతమంది విషయంలో మేలు చేస్తున్నప్పటికీ.. చాలా మంది విషయంలో కీడే ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం.
కాగా, ఫేస్బుక్ పరిచయంతో పెళ్లి చేసుకున్న ఓ జంట కోర్టు మెట్లెక్కింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యవహారానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫేస్బుక్ వివాహాలు నిలబడవు
ఫేస్బుక్ మూలంగా నిశ్చయమైన వివాహాలు నిలబడవని, విచ్ఛిన్నమైపోతాయని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెబీ పార్దివాలా అభిప్రాయపడ్డారు. అంతేగా ఆ దంపతులకు విడాకులు తీసుకోవలసిందిగా సూచించారు.
పెళ్లైన రెండు నెలలకే వేధింపులు
రాజ్కోట్కు చెందిన ఫాన్సీ షా అనే యువతి తన భర్త జయదీప్ షా, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ దాఖలు చేసిన కేసులో హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లైన రెండునెలలకే వారి వైవాహిక జీవితంలో తీవ్రస్థాయి వివాదాలు తలెత్తిన విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.
ఎఫ్బీ పెళ్లిళ్లు విఫలమే..
అయితే, ఇరు కుటుంబాలు ఓ అంగీకారానికి రావడానికి ఏ మాత్రం సుముఖంగా లేని విషయాన్ని న్యాయమూర్తి తెలిపారు. ‘ఫేస్బుక్ల ద్వారా నిర్ణయమౌతున్న ఆధునిక వివాహాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఈ పెళ్లి విఫలం అవకతప్పదు' అన్న అభిప్రాయాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు.
3ఏళ్ల ఎఫ్బీ పరిచయంతో పెళ్లి.. వేధింపులు
ఫాన్సీ, జయదీప్లిద్దరికీ 2011లో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీళ్లిద్దరూ 2015లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండు నెలలైనా అవకుండానే భర్త జయదీప్, అత్తమామలు తదితరులు తనను వేధిస్తున్నారంటూ ఫాన్సీ కేసు వేసింది.