ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు చిన్నారులతోపాటు 19మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ బస్తాలు తీసుకెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడటంతో 19 మంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. భావనగర్-అహ్మదాబాద్ హైవేపై బవల్యాలీ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సిమెంటు బస్తాలతో పాటు 25 మంది కూలీలు, వారి పిల్లలను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు రోడ్డుపై మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. కూలీలపై సిమెంట్ బస్తాలు పడటంతో 19 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో 16 మంది కూలీలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 11మంది మృతి
పుణ్యక్షేత్ర దర్శనకు వెళ్తున్న భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో 11 మంది పర్యాటకులు మృత్యువాతపడిన ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. చంపావత్ జిల్లాలోని తనక్పూర్ వద్ద శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులు కాలినడకన పుర్నగిరి క్షేత్రానికి వెళ్తుండగా.. వేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో ఘటనాస్థలంలోనే 9 మంది చనిపోయారు. దాదాపు 20 మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారని చంపావత్ ఎస్పీ ధీరేంద్ర గుంజియాల్ వెల్లడించారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధితులంతా ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా నవాబ్గంజ్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు.