గుల్బర్గ్ కేసు: 11 మందికి జీవిత ఖైదు, సరైన న్యాయం కాదన్న జాఫ్రి
గాంధీనగర్: గుల్బర్గ్ సొసైటీ అల్లర్ల కేసులో తీర్పు వెలువడింది. ఈ కేసులో దోషులుగా తేల్చిన 24 మందిలో 11 మందికి జీవిత ఖైదు విధించింది. కాగా ఆయుర్వేద డాక్టర్ అతుల్ వేద్, వీహెచ్పీ నేత సహా 12 మందికి ఏడేళ్ల జైలు శిక్ష విధించగా, మరొకరికి పదేళ్ల శిక్షను విధిస్తూ ప్రత్యేక విచారణ కోర్టు శుక్రవారం తీర్పును వెల్లడించింది.
2002లో గుజరాత్లోని గుల్బర్గ్లో జరిగిన ఈ అల్లర్లపై సుదీర్ఘ విచారణ జరిపి అల్లర్లు చెలరేగిన 14 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్లోని ప్రత్యేక కోర్టు ఇప్పటికే ఈ కేసులో 36మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. గుల్బర్గ్ అల్లర్ల కేసులో మొత్తం 66 మందిని నిందితులుగా పేర్కొంటూ గతంలో చార్జిషీటు దాఖలు చేశారు.
అయితే ఈ కేసు విచారణ సమయంలోనే ఐదుగురు చనిపోయారు. మరోవ్యక్తి కనిపించకుండా పోయాడు. విచారణ ఎదుర్కుంటోన్న 66 మందిలో 24 మందిని దోషులుగా పేర్కొన్న న్యాయస్థానం మిగిలిన 36మంది నిందితులని నిర్దోషులుగా విడిచిపెట్టింది. 24 మంది దోషులకి శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది.
They brutally killd Ehsan Jafri, this is quantum of sentence?They should have all got life imprisonment: Zakia Jafri pic.twitter.com/QrvcBRnAEy
— ANI (@ANI_news) June 17, 2016
2002లో గుల్బర్గ్ సొసైటీలో జరిగిన మారణకాండలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రి సహా 69 మంది సజీవ దహనం అయ్యారు. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ ఘటన జరిగినప్పుడు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ ఉన్నారు.
My brother is innocent, we will go to the SC against this verdict, not fair: Sister of one accused #GulbargSociety pic.twitter.com/Pj5Pb4ctsG
— ANI (@ANI_news) June 17, 2016
దీంతో గుల్బర్గ సొసైటీ అల్లర్ల కేసులో మోడీ ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ జకియా చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు సిట్ను విచారణకు నియమించింది. అయితే ఈ కేసు నుంచి మోడీకి ఊరట లభించింది.
కాగా, తాజా కోర్టు తీర్పుపై ఎహసాన్ జాఫ్రి భార్య జకియా జాఫ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.కోర్టు తీర్పు తనకు ఆనందం కలిగించలేదన్నారు. ఇది సరైన న్యాయం కాదన్నారు. దోషులందరికీ జీవితఖైదు విధించకపోవడంపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. దీనిపై తమ న్యాయవాదులను సంప్రదిస్తున్నానని చెప్పారు.
కోర్టు తీర్పును సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ స్వాగతించారు. దోషులుగా తేలిన 24 మందిలో 11 మందికే జీవితఖైదు విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన దోషులకు యావజ్జీవ శిక్ష విధించాలని అప్పీలు చేస్తామని ప్రకటించారు. తాము ప్రతీకారం కోరుకోవడం లేదని, పశ్చాత్తాపం కోరుకుంటున్నామని చెప్పారు.