పైనుంచి దూకి ఐఐటి గౌహతిలో విద్యార్థి మృతి
హైదరాబాద్: ఐఐటి గౌహతిలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఆదివారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్ భవనం నాలుగో అంతస్థు నుంచి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని గుర్గావ్కు చెందిన తుషార్ యాదవ్గా గుర్తించారు.
తుషార్ యాదవ్ ఐఐటి గౌహతిలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తుషార్ గదిలో తమకు ఓ లేఖ కనిపించింది. అది తన తల్లిదండ్రులను ఉద్దేశించి రాసి ఉంటాడని పోలీసులు చెప్పారు. గత రెండు నెలలుగా డిప్రెషన్తో బాధపడుతున్నట్లు అతను ఆ లేఖలో రాశాడు.

ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ ఇతర కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ర్యాగింగ్ కారణంగానే తుషార్ మరణించి ఉంటాడనే ఆరోపణలను ఐఐటి గౌహతి అధికారులు ఖండిస్తున్నారు. మరణించడానికి కొన్ని గంటల ముందు తుషార్ తల్లితో మాట్లాడాడని, అప్పుడు అతను మామూలుగానే అనిపించాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.
అంతకు ముందు రాత్రి తుషార్ తన గదిలో ఉన్నాడని ఐఐటి -జి ప్రజా సంబంధాల అధికారి లబను కోన్వర్ చెప్పారు. అతని రూమ్మేట్స్ అర్థ రాత్రి సమయంలో అతని మొబైల్కు ఫోన్ చేశారని, కానీ బదులు రాలేదని, ఉదయంపూట అతని శవాన్ని క్యాంటీన్ వర్కర్ చూశాడని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications