హర్యానా ఎన్నికల వేళ పెరోల్ కోరుతున్న ఆ రేపిస్ట్ బాబా-ఎవరికి మూడిందో ?
2017లో హర్యానాలో డేరా సచ్ఛా సౌధా ఆశ్రమం అధిపతిగా ఉంటూ తన శిష్యులైన ఇద్దరు మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు నిర్ధారణ కావడంతో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలుకు వెళ్లారు. అయితే ఆ తర్వాత వివిధ కారణాలతో ఆయనకు 10 సార్లు పెరోల్ లభించింది. దీనిపైనే తీవ్ర విమర్శలున్నాయి. అయితే తాజాగా 11వ సారి పెరోల్ కావాలని ఆయన పెట్టుకున్న దరఖాస్తు ఇప్పుడు హర్యానా ఎన్నికల వేళ కలకలం రేపుతోంది.
రేప్ ఆరోపణలు నిర్ధారణ కావడంతో 20 ఏళ్ల జైలు జీవితం గడుపుతున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు గతంలో ఇచ్చిన పెరోల్సే వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆయన పెరోల్ పై ఎందుకు బయటికి రావాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. అసలే హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు మరో 5 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి తరుణంలో గుర్మీత్ బయటికి వస్తే దాని ప్రభావం ఎన్నికలపై ఏ విధంగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

అయితే తన శి్ష్యులు, అనుచర బృందం ఇతరత్రా మార్గాల్లోకి వెళ్లిపోకుండా ఇలా రామ్ రహీమ్ సింగ్ పెరోల్ పేరుతో పదే పదే బయటికి వచ్చి వాళ్లను ప్రభావితుల్ని చేస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయనకు పెరోల్ ఇవ్వొద్దనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. మరోవైపు 2017లో జైలుకు వెళ్లాక 10 సార్లు గుర్మీత్ పెరోల్ పై బయటికి వచ్చిన సందర్భాలు కూడా గమనిస్తే వాటికి ఏదో ఒక ఎన్నికలు లేదా రాజకీయ కారణాలు నేపథ్యంగా కనిపిస్తున్నాయి.
గుర్మీత్ పెరోల్ పై బయటికి వచ్చిన 10 సార్లు కలిపితే దాదాపు 8 నెలల పాటు గుర్మీత్ బయటే ఉన్నాడు. తద్వారా ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకే ఇలా బయటికి వస్తున్నాడా అన్న చర్చ నెలకొంది. అసలే హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న వేళ గుర్మీత్ రాక ప్రభావం ఎవరిపై పడుతుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications