డేరా బాబా అకృత్యాలు: మగవారిని నపుంసకులుగా మార్చి.. ఆడవాళ్లపై నిత్యం అత్యాచారం!
అత్యాచారం కేసులో డేరా బాబా రాం రహీం సింగ్ అరెస్టయి, జైలుకు వెళ్లిన తరువాత అతడు సిర్సాలో సాగించిన అకృత్యాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఢిల్లీ: అత్యాచారం కేసులో డేరా బాబా రాం రహీం సింగ్ అరెస్టయి, జైలుకు వెళ్లిన తరువాత అతడు సిర్సాలో సాగించిన అకృత్యాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు సిర్సాలో డేరాబాబా అంగరక్షకుడిగా పనిచేసిన బియాంత్ సింగ్ ఒళ్లు జలదరింపచేసే వివరాలను వెల్లడించాడు.
దీనికి సంబంధించిన టేపులు తాజాగా వెలుగుచూశాయి. 18 నిముషాల ఆ వీడియో టేపు చూసిన వారికెవరికైనా డేరా బాబా అకృత్యాలు తెలిసి వెన్నులో చలిపుట్టుకొస్తుంది. తనకు ఎదురు తిరిగిన వారిని చంపించి ఆశ్రమంలోనే పూడ్చిపెట్టించాడంటే.. డేరా బాబా రాక్షసత్వం ఏమిటో అర్థమవుతుంది.
నపుంసకులుగా మార్చేవాడు...
గుర్మీత్ రాం రహీం సింగ్ సాగించిన అకృత్యాల గురించి ఆయన బాడీగార్డ్ బియాంత్ సింగ్ కథనం ప్రకారం.. జైలు శిక్ష పడిన డేరా బాబా రాం రహీం సింగ్ చేసిన అకృత్యాలు అన్నీఇన్నీ కావు. ఆశ్రమంలో ఉన్న తన పురుష అనుచరులందరినీ డేరా బాబా నపుంసకులుగా మార్చేవాడు. బలవంతంగా వారి వృషణాలను తొలగింపచేసి... ఎందుకు పనికిరాని వారిగా తయారు చేసేవాడు. చివరకు తనను కూడా సంసారానికి పనికిరాని పురుషుడిగా... నపుంసకుడిగా తయారుచేసేందుకు రంగం సిద్ధమవడం చూసి భయంతో పారిపోయినట్లు బియాంత్ సింగ్ చెప్పాడు. ప్రాణభయంతో చివరకు విదేశాలకు వెళ్లిపోయానన్నాడు. మరోవైపు డేరాబాబా మాత్రం.. ఆశ్రమంలోని సాధ్విలందరిపైనా వంతుల వారీగా అత్యాచారానికి పాల్పడేవాడు. వారి ఆక్రందనలు, ఆక్రోశాలేవీ అతడిని కదిలించలేకపోయేవి. అత్యంత దారుణంగా మానభంగాలు చేసి వారందరినీ ఆశ్రమంలోనే బందీలుగా ఉంచేవాడు.
అదేదో దైనందిన క్రతువులా...
సాధ్విలంతా కూడా అదేదో దైనందిన క్రతువులాగా బాబా గదిలోకి వెళ్లేవారు. అక్కడ అతడు ఆదేశించిన అభ్యంతరకరమైన పనులన్నిటినీ చేసేవారు. 1995లో మౌంట్ అబూ వెళ్లినపుడు ముక్కుపచ్చలారని ఓ పదహారేళ్ల అమ్మాయిని బాబా గదికి తీసుకు వచ్చారు. ఆమెను గదిలో బందీగా పట్టుకున్న బాబా కొన్ని గంటలపాటు... అసహాయురాలైన ఆ అమ్మాయిపై అత్యాచారాన్ని కొనసాగించాడనీ...అందుకు తానే సాక్ష్యమనీ బియాంత్ సింగ్ చెప్పాడు. కేకలుపెడుతూ...ఏడుస్తూ...ప్రాధేయపడుతున్న ఆ పదహారేళ్ల పసిదానికి జరిగిన అన్యాయానికి అక్కడున్న సెక్యూరిటీ గార్డులందరూ కూడా ప్రత్యక్ష సాక్షులేనని బియాంత్ సింగ్ చెప్పారు. ఒక్కరం కూడా ఆరోజు ఆ అన్యాయాన్ని అడ్డుకునే సాహసం చేయలేకపోయామన్నారు. ఇప్పటికీ ఆమె డేరాలో బందీగా ఉందన్నారు.
చంపేసి...ఆశ్రమంలోనే పూడ్చిపెట్టి...
డేరా ఆశ్రమంలో హత్యలు ఒకరకంగా నిత్యకృత్యమేనని బియాంత్ సింగ్ చెప్పాడు. తొలిసారిగా ఫకీర్చంద్ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేసి ఆశ్రమంలోనే పూడ్చేశారని, ఆ తర్వాత చంపిన వారందరినీ పక్కనే ఉన్న పఖ్రా నదిలో పడేసేవారని, కొంతమందిని ఆశ్రమ ప్రాంగణంలో పూడ్చిపెట్టేవారని చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే బాబా ‘ ఓ సైతాను' అని బియాంత్ పేర్కొన్నాడు. అంతేకాదు, డేరాలో భారీ ఎత్తున నల్లధనం నిల్వలున్నట్లు చెప్పాడు. నిరుపేదల భూములను కబ్జాచేసి భారీ ఆశ్రమాన్ని నిర్మించారని, భూమి సొంతదారులకు ఏదో కాస్త ముట్టజెప్పారని బియాంత్ సింగ్ వెల్లడించాడు.
అది పచ్చి అబద్ధం.. ఆమె పెంపుడు కుమార్తె కాదు..
డేరా బాబా ఆశ్రమంలో ఎక్కడికైనా...ఎప్పుడైనా సంచరించగలిగే మహిళ హనీప్రీత్ ఇన్సాన్. ఆమెను బాబా తన పెంపుడు కుమార్తెగా చెప్పుకొంటారనీ... కానీ అది పచ్చి అబద్ధమనీ గుర్మీత్ బాడీగార్డ్ బియాంత్ సింగ్ వెల్లడించారు. హనీప్రీత్ అతడికి ఎంతో ఇష్టమైన సహచరురాలని పేర్కొన్నాడు. హనీ అసలు భర్త బిశ్వాస్ గుప్తా అత్యంత సంపన్నుడనీ...ఆయన డేరా బాబా భక్తుడనీ తెలిపాడు. హనీని చేరదీసిన బాబా ఆమెతో కలిసి బిశ్వాస్ను నానా హింసలకూ గురిచేశారన్నాడు.