మసీదుపై మూక దాడి, నమాజ్ చేస్తున్నవారిని కొట్టారు: కేసు నమోదు
న్యూఢిల్లీ: గురుగ్రామ్ గ్రామంలోని మసీదుపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన డజను మందిపై గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు మసీదును ధ్వంసం చేయడమే కాకుండా నమాజ్ చేస్తున్న వ్యక్తులను కూడా కొట్టారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ సంఘటన బుధవారం సాయంత్రం భోరా కలాన్ ప్రాంతంలో జరిగింది.
దాడికి పాల్పడిన దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అయితే గురువారం సాయంత్రం వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. స్థానిక మసీదుపై కొందరు వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆ గుంపు.. అక్కడి వారిని కొట్టి, భక్తులను చంపుతామని బెదిరించారు. కొట్టిన అనంతరం గేటు మూసి నిందితులు పరారయ్యారు. ప్రస్తుతం నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ సమయంలో దాడి చేసిన వారి ఉద్దేశ్యం ఏమిటి?, వారు ఎందుకు? ఈ సంఘటనకు పాల్పడ్డారు అనేది స్పష్టంగా తెలియలేదు. సాయంత్రం కొందరు మసీదులో నమాజ్ చేస్తుండగా, కొందరు వ్యక్తులు లోపలికి ప్రవేశించి వారిని కొట్టారని బిలాస్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారు సుబేదార్ నాజర్ మహ్మద్ తెలిపారు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టమని ముస్లింలను బెదిరించారని కూడా ఆయన పేర్కొన్నారు.
పోలీసులు IPC సెక్షన్లు 295-A, 323, 506, 147, 148 కింద కేసు నమోదు చేశారు. రాజేష్ చౌహాన్ అలియాస్ బాబు, అనిల్ భడోరియా, సంజయ్ వ్యాస్ అనే ముగ్గురు నిందితులను కూడా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. త్వరలోనే ఈ ఘటనకు పాల్పడిన నిందితులను గుర్తించి జైలుకు పంపుతామన్నారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని విచారణ అధికారి ఏఎస్ఐ గజేందర్ సింగ్ తెలిపారు.