జ్ఞానవాపి మసీదుపై పిటిషన్లు-విచారణార్హతను మే 26న తేల్చనున్న వారణాసి కోర్టు
ఉత్తర్ ప్రదేశ్ లో వివాదాస్పదంగా మారుతున్న జ్ఞానవాపి మసీదు వివాదంలో హిందూ సంస్ధలు దాఖలు చేస్తున్న పిటిషన్లపై ముస్లిం సంఘాలు, మసీదు పాలమండలి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారణాసి కోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ముందు ఈ పిటిషన్ల విచారణార్హత తేల్చాలని నిర్ణయించింది.
జ్ఞానవాపి మసీదులో హిందూ ఆలయ ఆనవాళ్లు ఉన్నాయని, దీనిపై సర్వే నిర్వహించాలని దాఖలైన పిటిషన్లను గతంలో విచారించిన వారణాసి స్ధానిక కోర్టు వీడియో సర్వేకు ఆదేశించడం, అందులో కొన్ని హిందూ మతపరమైన కట్టడాల ఆనవాళ్లు కనిపించడంతో కలకలం రేగింది.
అయితే ఇలా ప్రార్ధనాలయాలను తవ్వి అవశేషాలు వెలికితీయడాన్ని నిషేదిస్తూ 1991లో కేంద్రం తీసుకొచ్చిన చట్టం కీలకంగా మారిపోయింది. దీన్ని కోట్ చేస్తూ ముస్లిం సంఘాలు.. జ్ఞానవాపి మసీదు రూపురేఖలు మార్చేందుకు కానీ, ఇక్కడ పూజలకు కానీ అనుమతించొద్దని కోర్టును కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 26న ఈ పిటిషన్ల విచారణార్హతను తేలుస్తామని వారణాసి కోర్టు ప్రకటించింది.
వాస్తవానికి 1991లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రార్ధనాలయాల విషయంలో ఓ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం 1947 తర్వాత ఏ ప్రార్ధనలయాల విషయంలో వచ్చే అభ్యంతరాలను కూడా కోర్టులు విచారణకు స్వీకరించరాదు. కానీ ఇప్పుడు వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో విచారణ ప్రారంభించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇవాళ వెలువరించాల్సిన తీర్పును వారణాసి కోర్టు వాయిదా వేసుకుంది. ముందుగా ఈ పిటిషన్ల విచారణార్హతను తేల్చాలని నిర్ణయం తీసుకుంది. మే 26న ఈ పిటిషన్లు విచారణకు అర్హత కలిగి ఉన్నాయని వారణాసి కోర్టు భావిస్తేనే దీనిపై తదుపరి నిర్ణయాలు ఉంటాయి.