మసూద్ అజహర్ను శపించు! సాధ్వీ ప్రగ్యాపై డిగ్గీరాజా సటైర్!
భోపాల్ : ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడేకొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. భోపాల్లో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్.. ప్రధాని మోడీ, తన ప్రత్యర్థి ప్రగ్యా ఠాకూర్పై విమర్శల పదును పెంచారు. ప్రతిపక్షాల తీరును కడిగిపారేశారు.

మసూద్ అజహర్ను శపించు
ముంబై పేలుళ్ల సమయంలో ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే మృతి చెందడానికి తన శాపమే కారణమన్న సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ స్పందించారు. ఆమె శాపానికి అంత పవర్ ఉంటే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను శపించాలని సటైర్ వేశారు. అలా చేస్తే సర్జికల్ స్ట్రైక్స్ అవసరమే ఉండేది కాదని చురకలంటించారు.

మోడీపై డిగ్గీరాజా ఫైర్
భోపాల్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ ఈ ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు గుప్పించారు. కలుగుల్లో దాక్కున్నా సరే వెంటాడి మరీ ఉగ్రవాదుల్ని వేటాడుతామన్న మోడీ, పుల్వామా, పఠాన్కోట్, ఉరి దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆ దాడులను అడ్డుకోవడంతో ఎందుకు విఫలమయ్యారని నిలదీశారు.

బీజేపీతో ప్రమాదం
కాంగ్రెస్కు సర్వమతాలు సమానమేనని దిగ్విజయ్ స్పష్టం చేశారు.
హిందువులు, ముస్లిం, సిక్కులు, క్రైస్తవులు అందరూ సోదరులేనని అన్నారు. బీజేపీ మాత్రం హిందువులకు ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ఈ దేశాన్ని ముస్లింలు 500ఏళ్లు పాలించినా ఏ మతానికి హాని తలపెట్టలేదన్న విషయాన్ని దిగ్విజయ్ గుర్తుచేశారు. మతం పేరుతో లబ్ది పొందాలనుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హర్ హర్ మోడీపై అభ్యంతరం
హర్ హర్ మోడీ నినాదంతో బీజేపీ హిందువుల మనోభావాలు గాయపరుస్తోందని దిగ్విజయ్ ఆరోపించారు. గూగుల్లో ఫేకూ అని టైప్ చేస్తే ఎవరి పేరు వస్తుందో అందరికీ తెలుసని మోడీకి చురకలంటించారు. భోపాల్ అభ్యర్థిగా తన పేరును కాంగ్రెస్ ప్రకటించిన వెంటనే బీజేపీ భయపడిందని, ఆ కారణంగానే ఉమాభారతి పోటీకి నిరాకరించారని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో నామినేషన్కు ఒక రోజు ముందు ప్రగ్యా ఠాకూర్ పేరును ప్రకటించారని దిగ్విజయ్ విమర్శించారు.












Click it and Unblock the Notifications