నచ్చిన ఆహారాన్ని తినే హక్కుంది, కానీ: సుప్రీం సీజే
న్యూఢిల్లీ: దేశంలో అసహనంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీరథ్ సింగ్ ఠాకూర్ గురువారం ఆ అంశంపై పరోక్షంగా స్పందించారు. 'ఆనందం' కోసం ఏదైనా ప్రత్యేకమైన ఆహారాన్ని తినే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని.. కానీ అది 'ఇతరులను బాధ పెట్టేదిగా' ఉండకూడదని చెప్పారు.
మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఏదైనా తినాలని అనుకుంటే.. నువ్వు తినటానికి అనుమతిస్తే అది నాకు ఆనందాన్నిస్తుంది. నాకు ఆనందాన్ని కలిగించేదేదైనా నా మానవ హక్కులతో ముడిపడిందే. కానీ, ఆనందమనేది ఇతరులను బాధపెట్టేదిగా ఉండకూడదు. అది హింసను ప్రేరేపించరాదు. హాని కలిగించని, ఆనందం కలిగించే వేటినైనా మానవ హక్కులుగానే పరిగణించాలి' అని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా రాజ్యాంగంలో పేర్కొన్న 'ఆనంద అన్వేషణలో అవకాశాల సమానత్వ హక్కు' భావనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో అన్నిరకాల మానవ హక్కులు ఇమిడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ), రాష్ర్టాల మానవ హక్కుల కమిషన్లను మరింత బలోపేతం చేసేందుకు 22ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన చట్టాలను సవరించాలని జస్టిస్ టిఎస్ ఠాకూర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మానవ హక్కుల కమిషన్ అధికారాలను పునఃసమీక్షించాల్సిన అవసరముందని తెలిపారు. ఎన్హెచ్ఆర్సీ తాత్కాలిక చైర్పర్సన్ జస్టిస్ క్రియాక్ జోసెఫ్ ఆవేదనతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధికారాలను పెంచాలని దాదాపు 600 సిఫారసులు కేంద్రానికి పంపినా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవని జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. ఎన్హెచ్ఆర్సీకి ఎలాంటి అధికారాలు లేవని చెప్పడం సరికాదన్నారు. ఎన్హెచ్ఆర్సీ తన బాధ్యతను నెరవేరుస్తున్నదని, వాటిని అమలు చేయడంలో కొన్ని అడ్డంకులున్నాయని, వాటిపై దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు. కాగా, మానవ హక్కులను కాపాడటానికి, ప్రోత్సహించటానికి పునరంకితం అవుతున్నట్టు లోక్సభ కూడా తీర్మానం చేసింది.












Click it and Unblock the Notifications