దేశద్రోహం: హార్దిక్ పటేల్ సన్నిహితుడు నీలేశ్ అరెస్ట్
అహ్మాదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో పటేళ్ల రిజర్వేషన్ కోసం ఆందోళన చేపట్టిన పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ సన్నిహితుడైన నీలేశ్ పటేల్ని బుధవారం గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సైబర్ క్రైం, దేశద్రోహం నేరాల కింద నీలేశ్ పటేల్ని సౌరాష్ట్రలోని మొరబీలో గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్)లో కీలక సభ్యుడైన నిలేశ్ పటేల్ జాతి విద్వేషాల్ని రెచ్చగొట్టే విధంగా గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.
కాగా, మంగళవారం ఆరావలి జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా హార్దిక పటేల్ ఓ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు. అయితే హార్దిక్ పటేల్ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తున్నారని సమాచారం అందుకున్న హార్దిక్ పటేల్ అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై మంగళవారం అర్ధరాత్రి విచారణ చేపట్టిన గుజరాత్ హైకోర్టు అతడిని పట్టుకుని కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
దీంతో హార్దిక్ పటేల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై మంగళవారం హార్దిక్ పటేల్తో సహా 20 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో గుజారత్ హైకోర్టు ప్రభుత్వానికి, డీజీపీకి, రేంజ్ ఇన్పెక్టర్ జనరల్, ఆరావళీ జిల్లా ఎస్పీకి హార్దిక్ పటేల్ ఎక్కడున్నాడో తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది.
హార్దిక్ ఎక్కడున్నారన్న విషయం ఆయన మిత్రులు, పటేల్ నేతలకు సైతం తెలియకపోవడంతో గుజరాత్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గుజరాత్లోని పటేళ్లను ఓబీసీ జాబితాలోకి చేర్చాలంటూ గత కొన్ని రోజులుగా హార్దిక్ పటేల్ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.