ఘోర అగ్నిప్రమాదం: 27 మంది సజీవ దహనం: 24 మంది మహిళలు మిస్సింగ్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సంభవించిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 27 మంది సజీవ దహనం అయ్యారు. 12 మందికి తీవ్ర గాయలయ్యాయి. 28 మంది గల్లంతయ్యారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఆచూకీ తెలియనివారిలో 24 మంది మహిళలు ఉన్నారు. వారి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. వారు జీవించి ఉండే అవకాశం లేదనే ఆందోళనలు సంఘటనా స్థలంలో వ్యక్తమౌతోన్నాయి.

ఓనర్ పరారీ..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇంకాస్సేపట్లో సంఘటన స్థలానికి చేరుకోనున్నారు. సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో ఇప్పటివరకు ఢిల్లీ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. భవన యజమానికి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, సెల్ ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా భవన యజమాని ఆచూకీపై ఆరా తీస్తున్నామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
ఎన్ఓసీ లేకుండా..
పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవన సముదాయంలో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ ఈ భవనంలో కొనసాగుతోంది. దీనికి అగ్నిమాపక విభాగం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ప్రాణాలను రక్షించుకోవడానికి అవసరమైన సామాగ్రి గానీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ గానీ లేవు. మంటలు చెలరేగిన వెంటనే అందులో పని చేసే కార్మికులు తప్పించుకోలేకపోయారు. సజీవ దహనం అయ్యారు.

క్షణాల్లో చుట్టుముట్టిన మంటలు..
ప్రమాద సమయంలో ఈ భవనంలో 150 మంది విధి నిర్వహణలో ఉన్నట్లు చెబుతున్నారు. మంటలు త్వరగా వ్యాప్తిచెందడానికి అవసరమైన సామాగ్రి అక్కడ ఉండటం వల్ల తీవ్రత పెరిగింది. క్షణాల్లో అగ్నికీలలు భవనాన్ని చుట్టుముట్టాయి. కార్మికులు తప్పించుకునే వీలు లేకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే ప్రకృతి వైపరీత్యాల నిర్వహణాధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
24 మంది మహిళలు మిస్సింగ్..
మంటలు పూర్తిగా ఆర్పివేయడానికి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టిందంటే- దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంఘటనా స్థలం నుంచి 27 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న మరో 12 మందిని కాపాడారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరో 28 మంది అదృశ్యమైనట్లు తమకు ఫిర్యాదులు అందాయని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ఔటర్) సమీర్ శర్మ తెలిపారు. వీరిలో 24 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు.
ఇద్దరి అరెస్ట్..
ఈ ఘటనలో ఇప్పటివరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కంపెనీ ఓనర్లు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్ను అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 304, 308, 120, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భవన యజమాని పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. కాగా- ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు. సహాయక చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు.












Click it and Unblock the Notifications