జాదవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో రూ. 1కే వాదిస్తున్న హరీశ్ సాల్వే
పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే ఫీజు కింద కేవలం ఒకే ఒక్క రూపాయి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే ఫీజు కింద కేవలం ఒకే ఒక్క రూపాయి తీసుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. నెదర్లాండ్స్లోని ది హేగ్లో జాదవ్ కేసులో విచారణ కొనసాగుతోంది.
సోమవారం భారత్ తరపున సాల్వే తన వాదనలు వినిపించారు. ఓ ప్రహసనంగా పాకిస్థాన్ జాదవ్కు మరణశిక్షను విధించిందని ఆయన కోర్టు ముందు ఆరోపించారు. గూఢచర్యం కేసు కింద పాక్ సైనిక కోర్టు జాదవ్కు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.
రాజ్యాంగ చట్టంపై వాదించడంలో సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే దిట్ట. ఆయన గతంలో అనేకసార్లు భారత్ తరపున అంతర్జాతీయ వేదికలపై కేసులు వాదించారు. అయితే జాదవ్ కేసులో సాల్వే కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఛార్జ్ చేశారు. అంతర్జాతీయ కోర్టు జాదవ్ కేసులో ఓ నిర్ణయానికి రాక ముందే పాకిస్థాన్ అతన్నిఉరితీసే అవకాశాలు ఉన్నాయని కూడా సాల్వే భయాందోళనలు వ్యక్తం చేశారు.
Not fair. #HarishSalve has charged us Rs.1/- as his fee for this case. https://t.co/Eyl3vQScrs
— Sushma Swaraj (@SushmaSwaraj) May 15, 2017
ఆయన రూ. 1 మాత్రమే తీసుకుంటున్నారు: సుష్మా
పాక్ తీరు రెచ్చగొట్టేలా ఉందని, వియత్నాం ఒప్పందాన్ని పాక్ గౌరవించడం లేదని చెబుతూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్ భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్థాన్ పై బారత్ కేసు వేసిన సంగతి తెలిసిందే. దీనిని భారత మాజీ సాలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే వాదిస్తున్నారు.
దీనిపై ఒకనెటిజన్ స్పందిస్తూ... హరీష్ సాల్వేకు భారీ మొత్తం ముట్టజెప్పి ఈ కేసును వాదింపజేయాల్సినంత అవసరం లేదని, ఆయనకు ఇచ్చే ఫీజులో కొంత మొత్తం ఇస్తే...ఈ కేసును వాదించేందుకు చాలా మంది ముందుకు వస్తారని పేర్కొంటూ సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన ఆమె...అలా అనడం తప్పు అని నెటిజన్కు హితవు పలికారు. అంతేగాక, ఈ కేసు వాదించేందుకు హరీష్ సాల్వే వసూలు చేస్తున్న ఫీజు కేవలం రూపాయి మాత్రమేనని అన్నారు. దీంతో నెటిజన్లు హరీష్ సాల్వేను అభినందిస్తుండగా, నెటిజన్ కు హితవు పలుకుతూ సందేశాలు ట్వీట్ చేశారు.
మరణ శిక్షను రద్దు చేయండి
పాకిస్థాన్ మిలటరీ కోర్టు తమ దేశ మాజీ నౌకాదళాధికారి కుల్భూషణ్ జాదవ్కు విధించిన మరణ శిక్షను తక్షణమే రద్దు చేయాలని సోమవారం అంతర్జాతీయ న్యాయస్థానానికి భారత్ విజ్ఞప్తి చేసింది. లేదంటే తీర్పు వెలువడడానికి ముందే ఆ దేశం శిక్షను అమలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 46 ఏళ్ల జాదవ్ను పాక్ ప్రభుత్వం గత ఏడాది మార్చి 3న అరెస్టు చేసింది.
గూఢచర్యం, కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఉరి శిక్ష విధించింది.ఈ శిక్షను నిలుపుదల చేయించాలని కోరుతూ భారత్..ఐక్య రాజ్య సమితిలో అంతర్భాగమైన అంతర్జాతీయ న్యాయ స్థానం (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్-ఐసీజే)ను ఆశ్రయించింది. మరణశిక్షను నిలుపుదల చేయాలని ఈ నెల 8న భారత్ పిటిషన్ దాఖలు చేయగా, 9వ తేదీన స్టే ఉత్తర్వులు వచ్చాయి. మొత్తం 15మంది న్యాయమూర్తుల్లో 11 మంది ఈ కేసును విచారిస్తున్నారు. వాదనలు వినిపించేందుకు ఒక్కో దేశానికి గంటన్నర సమయం ఇచ్చారు.
విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి దీపక్ మిత్తల్ తొలుత న్యాయస్థానానికి ఈ సమస్యను వివరించారు. తగిన న్యాయ సహాయం, దౌత్యపరమైన సేవలు పొందే హక్కు జాదవ్కు ఉందని చెప్పారు. దౌత్యపర హక్కుల విషయమై ప్రపంచ దేశాలు అంగీకరించిన 'వియన్నా సంప్రదాయాలను' ఉల్లంఘిస్తోందని చెప్పారు. (దౌత్య సంబంధాలపై 1961లో ఆస్ట్రియాలోని వియన్నాలో పలు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలనే వియన్నా సంప్రదాయాలని అంటారు. ఈ బప్పందాలపై ఇప్పటివరకు 191 దేశాలు సంతకాలు చేశాయి.)
ప్రధాన న్యాయవాదిగా వ్యవహరిస్తున్న హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ కేసు విచారణలో ఉండగా ఉరి శిక్షను అమలు చేయడం తగదని చెప్పారు. జాదవ్ను తమ దౌత్యవేతలకు అందుబాటులోకి తీసుకురావాలని భారత్ 16 సార్లు విజ్ఞప్తి చేసినా పాకిస్థాన్ పెడచెవిన పెట్టిందని తెలిపారు. పౌర, రాజకీయ హక్కుల అంతర్జాతీయ ఒప్పందం (ఇంటర్నేషనల్ కావెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్-ఐసీసీపీఆర్) ప్రకారం అహేతుకంగా ఎవరి జీవితాలనూ హరించడానికి వీల్లేదని అన్నారు. ఆయనపై మోపిన అభియోగాల పత్రాన్ని కూడా తమకు ఇవ్వలేదని తెలిపారు. జాదవ్ను చూపించాలంటూ ఆమె తల్లి చేసిన విజ్ఞప్తులను కూడా పట్టించుకోలేదని తెలిపారు. మొత్తం 90 నిమిషాల పాటు వాదనలు వినిపించారు.
వియన్నా సంప్రదాయాలు వర్తించవు: పాక్ వాదన
పాకిస్థాన్ అధికారులు తమ వాదనలు వినిపిస్తూ తీవ్రవాద చర్యలకు పాల్పడే గూఢచారులకు వియన్నా సంప్రదాయాలు వర్తించవని అన్నారు. ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయం అధికారి మహ్మద్ ఫైసల్ తొలుత మాట్లాడుతూ రాజకీయ నాటకాల కోసమే ఇలాంటి అసంబద్ధ ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. జాదవ్ పాసుపోర్టులో ముస్లిం పేరు ఎందుకు ఉందో ఇంతవరకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
జాదవ్ను వెంటనే ఉరితీయబోమని, అపీలు చేయడానికి ఆరు నెలల సమయం ఉందని చెప్పారు. ఈ కేసులో అత్యవసరం ఏమీ లేదని, వియన్నా సంప్రదాయాలకు పరిమితులు ఉన్నందున ఇది విచారణ పరిధిలోకి రాదని, ఉపశమనం పొందే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నందున ఈ పిటిషన్ను కొట్టివేయాలని పాక్ న్యాయవాది ఖురేషీ కోరారు. గంట కన్నా తక్కువ సమయంలోనే పాక్ తనవాదనలను ముగించింది. జాదవ్ నేరం అంగీకరిస్తున్నట్టు ఉన్న వీడియోను ప్రదర్శిసామని పాక్ విజ్ఞప్తిచేయగా, అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. ఇది పాక్కు ఎదురుదెబ్బేనని అనంతరం హరీష్ సాల్వే స్పష్టం చేశారు.