హర్యానా అసెంబ్లీ రద్దు- ఎన్నికల వేళ గవర్నర్ దత్తాత్రేయ సంచలనం ..!
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. వచ్చే నెల 5న హర్యానాలో ఒకే దశలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికలకు ముందు ఆకస్మికంగా అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపారు. దీంతో రాష్ట్రపతి కూడా దీన్ని ఆమోదించడంతో హర్యానా అసెంబ్లీని రద్దయినట్లు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎన్నికలకు సరిగ్గా 20 రోజుల ముందు ఇలా హర్యానా అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ జరుగుతోంది. దీనికి అసలు సమాధానం రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించేందుకే అనేది హర్యానా రాజ్ భవన్ వర్గాల మాట. ఏ రాష్ట్రంలో అయినా ఓ అసెంబ్లీ సమావేశానికీ, మరో అసెంబ్లీ సమావేశానికీ మధ్య ఆరు నెలలకు మించి గడువు ఉండకూడదు. ఈ లెక్కన హర్యానాలో చివరి అసెంబ్లీ సమావేశం మార్చిలో జరిగింది. ఆరు నెలలు పూర్తి కావస్తుండటంతో మరో అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి. అలా కుదరకపోతే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలి.

ఇప్పుడు ఎలాగో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వచ్చేయడంతో రాజ్యంగ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు హర్యానా అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్ దత్తాత్రేయ రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. దీంతో రాష్ట్రపతి అసెంబ్లీని రద్దు చేశారు. వాస్తవానికి హర్యానాలో మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల తర్వాత మరో భేటీ జరగాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జేజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ సమయంలో అసెంబ్లీని నిర్వహిస్తే విపక్షాలు ప్రభుత్వం రాజీనామాకు డిమాండ్ చేస్తాయి. ఈ నేపథ్యంలో సీఎం నాయబ్ సైనీ అసెంబ్లీ భేటీ నిర్వహించకుండా తప్పించుకునేందుకు ఎత్తులు వేశారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో అసెంబ్లీ రద్దు చేయకపోతే రాజ్యాంగ సంక్షోభం తప్పదు. అందుకే గవర్నర్ ఎన్నికల వేళ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications