ఈ ఉగ్రవాదులను మీరు చూస్తే చెప్పండి (వీడియో)
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లో ఉగ్రవాదులు అనుమానాస్పదంగా సంచరించడంతో కలకలం రేగింది. పోలీసులు సైతం హడలిపోయి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఏడు మంది ఉగ్రవాదులు ఒకే వీదిలో సంచరించారని పోలీసు అధికారులు చెప్పారు.
డెహ్రాడూన్ నగరంలో ఉగ్రవాదులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న దృశ్యాలు ఓ సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను పోలీసులు వాట్సాప్ లో విడుదల చేశారు. ఈ ఏడు మందిని ఎక్కడైనా చూస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు మనవి చేశారు.
పోలీసు అధికారులు విడుదల చేసిన వీడియోలో ముందు ముగ్గురు, వెనుక నలుగురు ఉగ్రవాదులు అనుమానాస్పదంగా సంచరించారు. ముఖానికి ముసుగులు ధరించి, వీపుకు బ్యాగులు వేసుకుని తిరుగుతున్న విషయం సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.
గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఐబీ వర్గాలు హెచ్చరించడంతో అన్ని రాష్ట్రాల్లో పోలీసు అధికారులు అప్రమత్తమైనారు. పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేశారు.
ఈ తనిఖీలలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాలు పరిశీలించగా ఈ ఏడు మంది ఉగ్రవాదుల కదలికలు వెలుగు చూశాయి. డెహ్రాడూన్ లోని ఓ వీదిలో వీరు దర్జాగా సంచరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు.
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు పెట్టుకున్న నలుగురు ఉగ్రవాదులను సీసీ టీవీ కెమెరా ఆధారంగా హరిద్వార్ లోని రూర్కీలో అరెస్టు చేశారు. ఇప్పుడు డెహ్రాడూన్ నగరంలో ఇలా సీసీ టీవీ కెమెరాలో ఉగ్రవాదులు దర్శనం ఇవ్వడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.