ప్రతిష్ట కాదు, బెయిల్ బాండ్ కట్టండి: కేజ్రీకి హైకోర్టు షాక్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో చుక్కెదురయింది. కేజ్రీవాల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తన కస్టడీ విషయమై ఢిల్లీ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. కేజ్రీవాల్ దరఖాస్తును పరిశీలించిన ధర్మాసనం బెయిల్ బాండ్ చెల్లించి జైలు నుంచి బయటకు రావాలని సూచించింది. దీనిని ప్రతిష్టకు సంబంధించిన అంశంగా పరిగణనించవద్దని చెప్పింది.
కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత న్యాయ సందేహాలను లేవనెత్తవచ్చని సూచించింది. కోర్టు సూచనలను జైల్లో ఉన్న కేజ్రీవాల్కు తెలిపేందుకు ఆయన తరపు న్యాయవాదులను మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయం ఇచ్చింది. తిరిగి మూడు గంటలకు న్యాయస్థానం ఈ విషయంపై విచారణ చేపట్టింది. హైకోర్టు సూచనలను కేజ్రీవాల్ పాటించారు. న్యాయస్థానం సూచనల మేరకు బెయిల్ బాండ్ కట్టేందుకు అంగీకరించారు. అతనికి బెయిల్ రానుంది.
కాగా, కేజ్రీవాల్కు ఢిల్లీ న్యాయస్థానం నాలుగు రోజుల క్రితం 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అనంతర విచారణను కోర్టు జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. బిజెపి మాజీ అధ్యక్షుడు నేత నితిన్ గడ్కరీ పరువు నష్టం దావా కేసులో అంతకుముందు కేజ్రీవాల్ కోర్టు ముందుకు హాజరయ్యారు.
కోర్టుకు బెయిల్ బాండ్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించడంతో అదుపులోకి తీసుకోవాలి ఆదేశించింది. కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. దాంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీహార్ జైల్లో ఉంచారు. శుక్రవారం పోలీసులు తిరిగి కేజ్రీవాల్ను కోర్టులో ప్రవేశ పెట్టారు. పూచీకత్తు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.
దీంతో కోర్టు ఆయనకు మరో 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించి, కేసును వాయిదా వేసింది. కాగా, కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ హాజరవుతున్న నేపథ్యంలో ఎఎపి మద్దతుదారులు, నాయకులతో కోర్టు కిటకిటలాడింది. కేజ్రీవాల్ భార్య సునీత కూడా కోర్టుకు వచ్చారు. అయితే వారందరినీ న్యాయమూర్తి బయటకు పంపించారు. తన కస్టడీ పైన కేజ్రీవాల్ హైకోర్టుకు వెళ్లారు.