‘ఆయన మీ గవర్నర్’... దటీజ్ మోడీ..! పర్యటన ఆద్యంతం ఆసక్తికరం...
ప్రధాని మోడీ చెన్నై పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విమానాశ్రయంలో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలిక
చెన్నై: ప్రధాని మోడీ చెన్నై పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విమానాశ్రయంలో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా అడయార్ ఐఎన్ఎస్కు చేరుకున్న మోడీ.. అక్కడి నుంచి రోడ్డుమార్గాన మద్రాస్ వర్శిటీకి వచ్చారు. మార్గం మధ్యలో మెరీనాలో ఉన్న 'కార్మికుల విగ్రహం' వద్ద ఆగి, వాహనం బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు.

అదీ మోడీ సంస్కారం...
అనంతరం యూనివర్శిటీలోకి వెళ్లిన మోడీకి దినతంతి నిర్వాహకులు సాదర స్వాగతం పలుకడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూపించారు. అయితే నిర్వాహకులు తనకు మాత్రమే వివరిస్తుండడంతో.. మోడీ.. ‘ఆయన మీ గవర్నర్...' అంటూ తన వెనుకవున్న భన్వరీలాల్ పురోహిత్ను చూపించారు. దాంతో నిర్వాహకులు గవర్నర్కు నమస్కరించి ఆయనకు కూడా ప్రదర్శన విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని వేదిక ముందున్న ప్రముఖుల వద్దకు దిగి వచ్చారు. అందరినీ పేరుపేరునా పలుకరించారు. రెండో వరుసలో ఉన్న ఎండీఎంకే నేత వైగో తదితరులను ప్రత్యేకంగా పిలిచి మరీ పలుకరించారు. దీంతో అతిథులంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు.

చిరుజల్లులను సైతం లెక్క చేయక...
కార్యక్రమం నుంచి బయటకు వెళ్లే సమయంలో మెరీనా రోడ్డు పక్కన నిలబడి ఉన్న కార్యకర్తలకు అభివాదం చేసేందుకు ప్రధాని మోడీ తన వాహనాన్ని అతినెమ్మదిగా నడపాలని డ్రైవర్ కు సూచించారు. ప్రధాని ఆదేశం మేరకు డ్రైవర్ స్పీడు తగ్గించడంతో పీఎం కాన్వాయ్ లో ఆయన వాహనానికి ముందూ, వెనుకా ఉన్న వాహనాలు సైతం ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. చిరుజల్లులను సైతం లెక్క చేయకుండా ప్రధాని కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేయడంతో ప్రజానీకం సంతోషంతో ‘మోడీకి జై' అంటూ నినాదాలు చేశారు.

ప్రశాంతంగా ముగిసిన పర్యటన...
సోమవారం ఉదయం 10.10 గంటలకు చెన్నై చేరుకున్న ప్రధాని... 10.34 గంటలకు మద్రాసు వర్శిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 11.30 గంటలకు అది ముగియగానే ఆయన... ఎంఆర్సీ నగర్లో జరిగిన ఐఏఎస్ అధికారి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. అనంతరం 12.12 గంటలకు స్థానిక గోపాలపురం వెళ్లి అక్కడ డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని పరామర్శించారు. అనంతరం ఐఎన్ఎస్లో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయి వరద నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఒంటిగంట ప్రాంతంలో ఆయన ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోడీకి తమిళనాడు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం తదితరులు వీడ్కోలు పలికారు.

రూ.1500 కోట్లు ఇవ్వండి: సీఎం పళని విజ్ఞప్తి...
తీవ్ర వర్షాల కారణంగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, తిరువారూర్ జిల్లాలు నష్టపోయాయని, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు రూ.1,500 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు తాను ప్రధానికి లేఖ ఇచ్చినట్టు సీఎం పేర్కొన్నారు. ప్రధాని పర్యటన ముగిసిన అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ... వరద నష్టంపై తాము ప్రధానికి వివరించామన్నారు. మోడీ సైతం తన అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేంద్రం నుంచి త్వరలోనే సాయం అందుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications